
తెలంగాణలోని అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. సాగు పెట్టుబడి కోసం ఇచ్చే ఈ సాయాన్ని పక్కాగా అర్హులకు మాత్రమే అందించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఆధునిక సాంకేతికతను వాడుతూ భారీ ప్రక్షాళనకు తెరలేపింది.
పథకాల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం ఈసారి ‘శాటిలైట్ మ్యాపింగ్’ సర్వేను ఆయుధంగా ఎంచుకుంది. సింథటిక్ ఎపర్చర్ రాడార్ (SAR) టెక్నాలజీ ద్వారా ఏ భూమిలో పంట సాగవుతోంది? ఏది బీడు భూమి? అనేది అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొండలు, రోడ్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, వాణిజ్య భవనాలు ఉన్న భూములకు కూడా గతంలో రైతు భరోసా నిధులు వెళ్లినట్లు ఈ సర్వేలో తేలింది. ఈ అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పుడు పక్కా సాగులో ఉన్న భూములకే నిధులు ఇవ్వాలని డిసైడ్ అయింది.
అన్నదాతలకు పండుగ తీపి కబురు అందిస్తూ.. సంక్రాంతి పండుగ లోపు అంటే జనవరి 13 లేదా 14వ తేదీలలో డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఎకరాకు రూ. 6,000 చొప్పున పెట్టుబడి సాయం అందనుంది. ఇప్పటికే నిధులు సిద్ధం చేసిన ప్రభుత్వం.. సర్వే నివేదిక అందగానే లబ్ధిదారుల తుది జాబితాను విడుదల చేయనుంది

