
తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ ఎమ్మెల్యేలకు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని మొత్తం 234 మంది శాసనసభ్యులకు అధికారిక కారుతో పాటు ప్రత్యేక అలవెన్సులు అందించనున్నట్లు వెల్లడించారు. డ్రైవర్, పీఏల ఖర్చుల కోసం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.లక్ష వరకు అలవెన్సులు కేటాయించనున్నట్లు తెలిపారు.
ఈ ప్రకటనతో అధికార పార్టీ సభ్యులు అసెంబ్లీలో హర్షం వ్యక్తం చేశారు. అయితే ప్రతిపక్ష సభ్యులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజల నుంచి సేకరించిన సొమ్మును ఇలా ఖర్చు చేయడం ప్రజాధనాన్ని వృథా చేయడమేనని విమర్శించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ శాసనసభలో ఎమ్మెల్యేలకు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని 234 మంది శాసనసభ్యులందరికీ ప్రభుత్వం తరఫున అధికారిక వాహనాలు అందించనున్నట్లు ప్రకటించారు. వాహనాల డ్రైవర్, ఇంధనం, నిర్వహణ ఖర్చుల కోసం నెలకు రూ.75 వేల అలవెన్స్తో పాటు, వ్యక్తిగత కార్యదర్శిని నియమించుకునేందుకు మరో రూ.25 వేల ప్రభుత్వ గ్రాంట్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రజలకు మరింత అందుబాటులో ఉండటంతో పాటు, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం విజయ్ తెలిపారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన, తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన సభ్యులకు ఈ సౌకర్యాలు మరింత ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
వీసీకే ఎమ్మెల్యే జోషిమణి చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయ్ తెలిపారు. నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకోవడం, ప్రభుత్వ ప్రాజెక్టుల అమలును పర్యవేక్షించడం ఎమ్మెల్యేల బాధ్యత అని ఆయన అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే సభ్యులు సైతం తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు ప్రభుత్వ వాహనాలు, అదనపు అలవెన్సులు సహాయపడతాయని సీఎం పేర్కొన్నారు.
విజయ్ ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన టీవీకే ఎమ్మెల్యే సింధు.. ఎంజీఆర్ సినిమాలోని పాట పాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. ఎమ్మెల్యేలకు కార్లు అందించాలన్న నిర్ణయంపై టీవీకే ఎమ్మెల్యే శబరి అయ్యంగారన్ తన అనుభవాన్ని పంచుకున్నారు.
“గతంలో నాకు కారు కూడా లేదు, ఉద్యోగం కూడా లేదు. కానీ మా నాయకుడు ఇప్పుడు మాకు ఉద్యోగాలతో పాటు కార్లను కూడా అందించారు. నేను ఇప్పటివరకు చెన్నైకి రైలులోనే వచ్చేవాడిని. ఇక అసెంబ్లీకి ఆటోలో వచ్చినప్పుడు, నేను ఎమ్మెల్యేనని చెబితే పోలీసులు నమ్మకపోవచ్చు. నా గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది” అని ఆమె వ్యాఖ్యానించారు.
అయితే, ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. 234 మంది ఎమ్మెల్యేలకు కార్లతో పాటు నెలకు రూ.లక్ష అలవెన్స్ ఇవ్వడం ప్రజాధనాన్ని వృథా చేయడమేనని డీఎంకే అధికార ప్రతినిధి ఏ. శరవణన్ విమర్శించారు.

