
యూజీసీ నెట్ ఆన్సర్ కీపై అభ్యంతరాలు నమోదు చేసేందుకు ఒక్కో ప్రశ్నకు రూ.200 ఫీజు విధించడంపై అభ్యర్థుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) స్పందించింది.
అర్థంలేని, అనవసరమైన అభ్యంతరాలను నియంత్రించేందుకే ఈ రుసుమును నిర్ణయించినట్లు ఎన్టీఏ స్పష్టం చేసింది. ఈ ఫీజు విధింపు వెనుక ఎలాంటి లాభాపేక్ష లేదని తెలిపింది. అభ్యర్థులు దాఖలు చేసిన అభ్యంతరాలను సబ్జెక్ట్ నిపుణులు పరిశీలించి, అవి సరైనవిగా తేలితే సంబంధిత అభ్యంతరానికి చెల్లించిన మొత్తం రూ.200ను పూర్తిగా రీఫండ్ చేస్తామని వెల్లడించింది.
అభ్యర్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నామని ఎన్టీఏ పేర్కొంది. ఆన్సర్ కీ, అభ్యంతరాల ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే.
యూజీసీ నెట్ పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీపై అభ్యంతరాలు నమోదు చేసే ప్రక్రియ ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఆన్సర్ కీలో తప్పులు లేదా సమాధానాలపై అభ్యంతరాలు ఉంటే వాటిని ప్రశ్నించే అవకాశం అభ్యర్థులకు ఉన్నప్పటికీ.. ఒక్కో ప్రశ్నకు రూ.200 చొప్పున రుసుము వసూలు చేయడంపై నిరసనలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి ప్రశ్నకు ఇంత మొత్తంలో ఫీజు చెల్లించాల్సి రావడం అభ్యర్థులపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) స్పందించింది. ఆన్సర్ కీపై అభ్యంతరాల నమోదుకు రూ.200 రుసుము ఎందుకు నిర్ణయించాల్సి వచ్చిందో వివరిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఫీజు విధానం వెనుక ఉన్న కారణాలను కూడా స్పష్టం చేసింది.
అర్థంలేని అభ్యంతరాలను నివారించేందుకే రూ.200 ఫీజు
ఆన్సర్ కీ ఛాలెంజ్కు సంబంధించి విద్యార్థుల నుంచి వస్తున్న విమర్శలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) స్పష్టత ఇచ్చింది. ఆన్సర్ కీ ఛాలెంజ్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండటంతో పాటు, ప్రతి విద్యార్థికి న్యాయం జరిగేలా రూపొందించామని తెలిపింది. ఈ ఫీజును వ్యాపార ప్రయోజనాల కోసం లేదా సంస్థకు లాభాలు సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో విధించలేదని స్పష్టం చేసింది.
ఆధారాలు లేకుండా పెద్ద సంఖ్యలో అనవసరమైన, అర్థంలేని అభ్యంతరాలు దాఖలు కాకుండా నిరోధించేందుకే ఒక్కో అభ్యంతరానికి రూ.200 ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తున్నామని NTA వెల్లడించింది.
సరైన అభ్యంతరానికి ఫీజు రీఫండ్
విద్యార్థులు దాఖలు చేసే అభ్యంతరాలను సంబంధిత సబ్జెక్టు నిపుణులు క్షుణ్ణంగా పరిశీలిస్తారని NTA తెలిపింది. విద్యార్థి లేవనెత్తిన అభ్యంతరం సరైనదేనని నిపుణులు నిర్ధారిస్తే, ఆ సమాధానాన్ని సవరించి తుది ఆన్సర్ కీలో మార్పులు చేస్తారు. ఈ సవరించిన సమాధానం ఆ పరీక్షకు హాజరైన విద్యార్థులందరికీ వర్తిస్తుంది.
అంతేకాకుండా, విద్యార్థి చేసిన అభ్యంతరం సరైనదిగా తేలితే, ఆ అభ్యంతరం కోసం చెల్లించిన రూ.200 ప్రాసెసింగ్ ఫీజును సైతం సంబంధిత విద్యార్థి ఖాతాలోకి తిరిగి జమ చేస్తామని NTA స్పష్టం చేసింది.

