
Telangana Petroleum Dealers Association:
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరతపై డీలర్స్ అసోసియేషన్ స్పష్టత ఇచ్చింది. అసోసియేషన్ అధ్యక్షుడు Marri Amarender Reddy పేరుతో ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. రాష్ట్రంలో ఎలాంటి ఇంధన కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ఇంధన కొరతపై తప్పుడు వార్తలు, అపోహలు వ్యాప్తి చెందడంతో చాలా మంది పెట్రోల్ బంక్లకు వెళ్లి అవసరానికి మించిన స్థాయిలో ట్యాంకులు నింపుకుంటున్నారని తెలిపారు. ఈ పానిక్ బాయింగ్ కారణంగా అమ్మకాలు సాధారణ స్థాయిలతో పోలిస్తే 2.5 నుంచి 3 రెట్లు పెరిగాయని చెప్పారు. దీని వల్ల దేశవ్యాప్తంగా పలు రిటైల్ అవుట్లెట్లలో తాత్కాలికంగా స్టాక్ తగ్గిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు.
అయితే వాస్తవానికి ఇంధన కొరత ఎక్కడా లేదని, HPCL, IOCL, BPCL సంస్థల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇంధన సరఫరా యథావిధిగా కొనసాగుతోందని తెలిపారు.
ఇక ఈ సందర్భంగా ప్రజలకు హెచ్చరిక కూడా జారీ చేశారు. పెట్రోల్ లేదా డీజిల్ను డబ్బాల్లో నిల్వ చేసుకోవడం PESO నిబంధనలకు విరుద్ధమని, ఇది తీవ్రమైన భద్రతా ప్రమాదాలకు దారితీస్తుందని పేర్కొన్నారు. సరైన విధంగా నిల్వ చేయకపోతే అగ్ని ప్రమాదాలు వంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశముందని హెచ్చరించారు.
ఇంధనాన్ని నిల్వ చేయడం సురక్షిత పద్ధతి కాదని స్పష్టం చేస్తూ, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. భయాందోళనలకు లోనవకుండా అవసరానికి తగ్గట్టుగా మాత్రమే ఇంధనం కొనుగోలు చేయాలని సూచించారు. అలాగే నకిలీ వార్తలను నమ్మకుండా, వాటిని పంచుకోవద్దని ప్రజలను కోరారు.

