
తెల్లవారుజామునే ప్రాణాలు కరిగిపోయాయి. గమ్యస్థానానికి చేరుకునేలోపే, మృత్యువు అగ్నికీలల రూపంలో దాడి చేసింది. మార్కాపురం జిల్లాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం హృదయ విదారక దృశ్యాలను మిగిల్చింది. మరోసారి ట్రావెల్స్ బస్సు ప్రయాణికుల ప్రాణాలను బలితీసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
నిద్రలో ఉన్న ప్రయాణికులు సజీవదహనమైపోయారు. ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో కొందరు బస్సు అద్దాల మధ్య ఇరుక్కుని మంటల్లో చిక్కుకున్నారు. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
సీటర్ కమ్ స్లీపర్ నాన్-ఏసీ బస్సు టిప్పర్ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఢీకొట్టిన వెంటనే బస్సు మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా, మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. కొందరు బస్సులోనే చిక్కుకుని కాలిపోగా, మరికొందరు బయటపడే క్రమంలో మంటల్లో చిక్కుకున్నారు.
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వారిలో 26 మందిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
హరికృష్ణ ట్రావెల్స్కు చెందిన ఈ బస్సు జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలిగిరి వైపు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. పలకల క్వారీ సమీపంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొట్టడంతో, టిప్పర్ డీజిల్ ట్యాంక్ నుంచి మంటలు చెలరేగి బస్సును చుట్టుముట్టాయి. అద్దాలు పగలగొట్టి బయటపడేలోపే పొగ వ్యాపించి ప్రయాణికులను ఉక్కిరిబిక్కిరి చేసింది. కొద్దిసేపటికే అగ్నికీలలు వేగంగా వ్యాపించడంతో బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది.
గాయపడిన వారిని మార్కాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వైద్యులు 26 మందికి చికిత్స అందిస్తున్నామని, వారిలో ఏడుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెల్లడించారు.
ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు.
మార్కాపురం ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన వారికి తక్షణ వైద్యసాయం అందించాలని, ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.
మంత్రి గొట్టిపాటి రవి, హోంమంత్రి అనిత తదితరులు కూడా అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

