
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై మోపబోమని కూటమి నేతలు పదేపదే చెబుతున్న నేపథ్యంలో, తాజాగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ట్రూ-అప్ ఛార్జీలపై ప్రతిపాదనలు పరిశీలిస్తున్న వేళ ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా వెల్లడించింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో కూడా వినియోగదారులపై అదనపు భారం వేయకూడదని నిర్ణయించింది.
డిస్కమ్లు చూపించిన సుమారు రూ.16 వేల కోట్ల ఆదాయ లోటును ప్రభుత్వమే భరించేందుకు సిద్ధమైంది. దీంతో వినియోగదారులకు భారీ ఊరట లభించనుంది.
విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో రూ.4,497.89 కోట్ల ట్రూ-అప్ ఛార్జీలను ప్రభుత్వమే భరించింది. మొత్తంగా గత 21 నెలల్లో రూ.20,288.46 కోట్ల భారాన్ని ప్రభుత్వం తీసుకుంది. గత సంవత్సరం సెప్టెంబర్లో రూ.923 కోట్లను ‘ట్రూ డౌన్’ చేయడం ద్వారా యూనిట్కు 13 పైసల తగ్గింపు కల్పించి గృహ వినియోగదారులకు మరింత ఉపశమనం ఇచ్చింది.
ఇక 2026-27 సంవత్సరానికి డిస్కమ్లు రూ.17,508.17 కోట్ల ఆదాయ లోటును ప్రతిపాదించాయి. దీనిని పరిశీలించిన ఈఆర్సీ, 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ట్రూ-అప్, విద్యుత్ కొనుగోలు ఛార్జీలు, ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ (FPPCA) కింద రూ.1,717.60 కోట్లను తగ్గించింది. ఫలితంగా రూ.15,790.57 కోట్ల లోటుకే ఆమోదం తెలిపింది.
అయితే ఈ లోటును వినియోగదారులపై మోపకుండా, ప్రభుత్వమే భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఈఆర్సీకి లిఖితపూర్వకంగా తెలియజేసింది.
ఈ నిర్ణయంతో 2026-27 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని స్పష్టమైంది. అలాగే 2024-25 సంవత్సరానికి సంబంధించిన ట్రూ-అప్ ఛార్జీల నుంచి కూడా వినియోగదారులకు ఉపశమనం లభించింది.
ఇక పలు రంగాలకు అనుకూలంగా ఈఆర్సీ కొన్ని మార్పులు చేసింది. పునరుత్పాదక ఇంధన రంగాన్ని ప్రోత్సహించేందుకు సోలార్ మాడ్యూల్ తయారీ పరిశ్రమకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. వాటర్ ప్లాంట్లు, ప్రింటింగ్ ప్రెస్లను వాణిజ్య విభాగం నుంచి పారిశ్రామిక విభాగానికి మార్చారు. జాతీయ రహదారులపై వీధి దీపాలను యుటిలిటీస్ విభాగంలోకి చేర్చారు.
అదే సమయంలో విద్యుత్ ప్రమాదాలను తగ్గించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డిస్కమ్లు, ట్రాన్స్కోకు ఈఆర్సీ ఆదేశించింది. ప్రజలు కూడా ఫిర్యాదులు, ఫోటోలు, వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయగల విధంగా వెబ్సైట్లలో సదుపాయం కల్పించాలని సూచించింది.

