
ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం మరోసారి నిధులను విడుదల చేసింది. దీనదయాళ్ అంత్యోదయ యోజన (DAY-NRLM / ఆజీవిక) కింద రూ.207 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ నిధులు స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి మరో శుభవార్త లభించింది. దీనదయాళ్ అంత్యోదయ యోజన (DAY) మరియు జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (NRLM) కింద రూ.207 కోట్ల నిధులు కేటాయించారు. ఈ నిధుల విడుదలపై స్పందించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి ఇవి కీలకమని చెప్పారు. ఈ సహాయంతో మహిళల ఆర్థిక స్వావలంబన పెరగడంతో పాటు కుటుంబాల ఆదాయ స్థాయి మెరుగుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామీణాభివృద్ధి మరింత వేగంగా సాగుతుందని తెలిపారు.
“దీన్ దయాళ్ అంత్యోదయ యోజన (DAY-NRLM / ఆజీవిక) పథకం కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్కు రూ.207 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ నిధులు గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసి, స్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా సాధికారత, సమగ్ర వృద్ధిలో కొత్త దిశగా ముందుకు సాగుతోంది” అని ట్వీట్లో పేర్కొన్నారు.
కేంద్రం విడుదల చేసిన ఈ నిధులు మహిళా శక్తికి మరింత బలం చేకూరుస్తాయని, ఆత్మనిర్భర ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు ఇవి పునాది వేస్తాయని తెలిపారు. ఇదే విషయంపై స్పందించిన సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులకు తోడు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 40 శాతం నిధులు కూడా విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈ నిధులు డ్వాక్రా మహిళలకు ఎంతో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.
ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫైబర్నెట్ ప్రాజెక్టుకు రూ.62.67 కోట్లు విడుదల చేసింది. ఏపీ ఫైబర్నెట్ లిమిటెడ్ వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించేందుకు ఈ మొత్తాన్ని కేటాయించారు. 2026–27 వార్షిక బడ్జెట్లోని కేటాయింపుల నుంచి ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అవసరమైన చర్యలు తీసుకోవాలని ఫైబర్నెట్ ఎండీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

