
విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్కు ఏపీ ప్రభుత్వం భారీగా రాయితీలు ప్రకటించింది. రిలయన్స్ రూ.1,08,000 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా.. ఏపీ ప్రభుత్వం దాదాపు రూ.19 వేల కోట్ల వరకూ రాయితీలను ప్రకటించింది. ఈ మేరకు డేటా సెంటర్కు భూమిని కేటాయించేందుకు అనుమతించారు. అలాగే భారీగా రాయితీలు కల్పించేందుకు ఓకే చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులతో వస్తున్న కంపెనీలకు భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తోంది. విజయనగరం జిల్లాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.1,08,010 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న కేబుల్ ల్యాండింగ్ స్టేషన్, గిగా స్కేల్ ఏఐ డేటా సెంటర్కు ప్రభుత్వం దాదాపు రూ.19వేల కోట్ల వరకు భారీగా ప్రోత్సాహకాలను అందించింది. విజయనగరం జిల్లాలో రిలయన్స్ డేటా సెంటర్ కోసం 854.97 ఎకరాలను 25 శాతం తగ్గింపు ధరతో కేటాయించేందుకు అనుమతించారు. రిలయన్స్కు ఆర్థిక, ఆర్థికేతర ప్రోత్సాహకాలు చెల్లించేందుకు టైలర్మేడ్ విధానంలో గ్రీన్సిగ్నల్ ఇచ్చారు.
రిలయన్స్ సంస్థకు స్టాంపు డ్యూటీ మినహాయింపు ఇచ్చారు. యంత్రాలు, పరికరాలకు సంబంధించిన ఖర్చులో 6 శాతం పెట్టుబడి రాయితీ (రూ.4,500 కోట్లను 10 వాయిదాల్లో చెల్లిస్తారు). రిలయన్స్ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి చేసే ఖర్చుపై స్టేట్ జీఎస్టీ మినహాయింపు ఇచ్చారు.. గరిష్ఠంగా 10 ఏళ్లలో రూ.2,527.38 కోట్లను చెల్లిస్తారు. లీజ్కు సంబంధించి 10 ఏళ్ల పాటూ స్టేట్ జీఎస్టీ గరిష్టంగా రూ.1800 కోట్లు మినహాయింపు ఇచ్చారు. నీటి టారిఫ్లో 15 శాతం రాయితీ (10 ఏళ్లలో రూ.552.41 కోట్లు).. ఏపీజీడబ్ల్యూ ఫైబర్ యాక్సెస్ కాస్ట్లో 20 ఏళ్ల పాటూ 30శాతం రాయితీ (రూ.1,220.71కోట్లు) ఇచ్చారు.

