
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్ వచ్చింది. ఈ పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. 2 ప్యాకేజీలతో బిడ్ల దాఖలుకు టెండర్ల ఆహ్వానించారు. ప్యాకేజీ-1లో గిర్మాపూర్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు.. ప్యాకేజీ-2లో ప్రజ్ఞాపూర్ నుంచి తంగడ్పల్లి వరకు ఉంటుంది. ఈ రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం 161 కిలోమీటర్లు, ఆరు వరుసలుగా ప్లాన్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం కేంద్రం సహకారంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (RRR) నిర్మాణంలో కీలక ముందడుగుపడింది. కేంద్రం ఆర్ఆర్ఆర్ ఉత్తరభాగం పనులకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.. 5 ప్యాకేజీలను 2 ప్యాకేజీలుగా కుదించి వేర్వేరుగా ఎన్హెచ్ఏఐ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రీజినల్ రింగ్ రోడ్డు మొత్తం 161.518 కిలోమీటర్లు ఆరు వరుసలుగా రూ.9,362.4 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఈ రీజినల్ రింగ్ రోడ్డు టెండర్లకు సంబంధించి జులై 7వ తేదీ ఉదయం 11 గంటల వరకు గడువు ఉంది.. ఆలోపు ఆన్లైన్లో బిడ్లను సమర్పించాలని అధికారులు సూచించారు. ఆ మరుసటి రోజు (జులై 8)న బిడ్లు తెరుస్తారు. డిజైన్, బిల్ట్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన ఈ ఆర్ఆర్ఆర్ పనులు చేపట్టాల్సి ఉంటుందని ఎన్హెచ్ఏఐ నోటిఫికేషన్లో తెలిపింది.
ఈ ఆర్ఆర్ఆర్ సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్లో మొదలై.. యాదాద్రి భువనగిరి జిల్లా తంగడ్పల్లి దగ్గర ముగుస్తుంది. ప్యాకేజీ 1లో 83.518 కిలోమీటర్లు పొడవున సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ వరకు రూ.4,918.71 కోట్లు వ్యయంగా అంచనా వేస్తున్నారు. ప్యాకేజీ 2లో మొత్తం 78 కిలోమీటర్లు కాగా.. రూ.4,443.69 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఇప్పటికే ప్యాకేజీ-1, ప్యాకేజీ-2లో భూమిని సేకరించారు. ఈ RRRలో 9చోట్ల నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలు కనెక్ట్ అవుతాయి. 9 టోల్ప్లాజాలాు, 44 పెద్ద బ్రిడ్జిలు, 127 చిన్న బ్రిడ్జిలు, 44 అండర్ పాస్లు, 4 ఆర్వోబీలు రానున్నాయి

