
టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని నెలల క్రితం పదో తరగతి పరీక్షలకు ముందు.. మంచి మార్కులు సాధించిన విద్యార్థులను విమానంలో తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా టెన్త్ పరీక్షల్లో బాగా మార్కులు వచ్చిన విద్యార్థులను గుర్తించి.. వారిని 3 రోజుల ఢిల్లీ టూర్కి తీసుకెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉపరాష్ట్రపతిని కూడా కలిసే ఏర్పాట్లు చేస్తుండటం విశేషం.
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి .. తన నిర్ణయాలతో తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవలె తన వద్ద పనిచేసే పీఏ పదవికి ఒక ట్రాన్స్జెండర్ను ఎంపిక చేసి.. అందరి నుంచి ప్రశంసలు పొందిన గల్లా మాధవి తాజాగా.. మరో నిర్ణయం తీసుకున్నారు. పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు వచ్చి విద్యార్థులను విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లి.. మళ్లీ తీసుకురానున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం.. పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను విమానం ఎక్కిస్తానని గల్లా మాధవి.. హామీ ఇవ్వడం గమనార్హం. ఇచ్చిన మాట ప్రకారం.. వారిని విమానం ఎక్కించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టారు
తన నియోజకవర్గం పరిధిలో ఉన్న పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులు.. ఈ పరీక్షల్లో 550 మార్కుల కంటే ఎక్కువ ఎంతమంది తెచ్చుకుంటే.. వారందరినీ విమానంలో టూర్కు తీసుకువెళ్తానని ఆమె గతంలో మాట ఇచ్చారు. ఇక గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మొత్తం గుంటూరు అర్బన్ జిల్లాలోనే ఉంటుంది. ఈ పరిధిలో మొత్తం 8 మున్సిపల్ పాఠశాలలు ఉన్నాయి. ఆ స్కూళ్లలో చదివిన విద్యార్థుల్లో మొత్తం 39 మందికి.. ఇటీవల విడుదలైన ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల్లో 550పైగా మార్కులు వచ్చాయి.

