
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. సొంతింటి కల సాకారం చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్న పేదలు, కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నవారు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, నిరుద్యోగులు.. ఇలా అన్ని వర్గాలకు శుభవార్త చెప్పడానికి రేవంత్ సర్కారు సమాయాత్తం అవుతోంది. ఆ రోజే ఇందిరమ్మ జీవిత బీమా పథకం అనే నూతన స్కీమ్ సైతం ప్రారంభం కానుంది.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న రాష్ట్ర ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు రేవంత్ సర్కారు సన్నద్ధం అవుతోంది. రెండున్నరేళ్ల పాలనను పూర్తి చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. రెండో విడత సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటి వరకూ అమలు చేయలేకపోయిన హామీలను అమలు చేయడంతోపాటు.. మరింత మందికి సంక్షేమ పథకాలు అందించడం కోసం కొత్త అప్లికేషన్లను స్వీకరించనుందని తెలుస్తోంది.
రెండు లక్షల కొత్త ఫించన్లు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్య చికిత్స లాంటి కీలక నిర్ణయాలను జూన్ 2న ప్రకటించనున్నారని సమాచారం. త్వరలో యాదగిరిగుట్టలో జరిగే కేబినెట్ భేటీలో దీనికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయనున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఉద్దేశంతో తెలంగాణ సర్కారు ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది బడ్జెట్ సందర్భంగా ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.4 వేల కోట్లను కూడా కేటాయించింది. ఈ పథకం అమలు కోసం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సారథ్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే విధి విధానాలను రూపొందించింది.

