
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలోని గ్రామాల్లో సర్వే చేపట్టాలని నిర్ణయించారు. ఈ సర్వే ద్వారా గ్రామాలకు అవసరమైన మౌలిక సదుపాయాలను గుర్తించటంతో పాటుగా.. పల్లెలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతమవుతాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన పవన్ కళ్యాణ్… ఈ మేరకు అధికారులను ఆదేశించారు. అలాగే జియో ట్యాగింగ్తో రోడ్ల పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం అత్యంత పారదర్శకంగా క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు? ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నాయనే వివరాలతోపాటు పంచాయతీ భూములు, పోరంబోకు స్థలాలు, పశువుల మేత మైదానాలు, స్మశానవాటికల పూర్తి వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఈ సర్వే నివేదికల ఆధారంగా గ్రామాల్లో భూములకు రక్షణ కల్పించడంతోపాటు ప్రతి గ్రామం స్వయం సమృద్ధి సాధించేలా నూతన ఆదాయ వనరులను సృష్టించవచ్చని పవన్ కళ్యాణ్ సూచించారు. మంగళవారం క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె పండుగ 1, 2 కార్యక్రమాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో జరుగుతున్న ప్రగతిపై చర్చించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ పల్లె పండుగ 1, 2 కార్యక్రమాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోందన్నారు. పల్లె పండుగ తొలి విడతలో 4వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తైందని.. 2వ విడతలో 3,580 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించినట్లు తెలిపారు. మొదటి విడతలో 22,514 గోకులాలు పూర్తిచేయగా.. రెండవ విడతలో15,303 గోకులాలు నిర్మించినట్లు వెల్లడించారు. పశువుల తాగునీటి అవసరాల కోసం 15,188 నీటి తొట్టెలు నిర్మించినట్లు తెలిపారు. మొదటి విడతలో 21 వేల ఫార్ పాండ్స్ పూర్తి చేస్తే.. రెండవ విడతలో 86 వేలు ఫార్మ్ పాండ్స్ కుంటలను తవ్వించినట్లు వెల్లడించారు.

