
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’. ఈ ప్రాజెక్ట్పై ప్రేక్షకుల్లోనే కాకుండా ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో భారీ బడ్జెట్, అత్యాధునిక సాంకేతికతతో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
‘వారణాసి’ నిర్మాణం వెనుక జరుగుతున్న భారీ కృషిని ప్రేక్షకులకు పరిచయం చేసేలా ప్రత్యేకంగా ఓ మేకింగ్ డాక్యుమెంటరీ రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం భారీ యాక్షన్ సీక్వెన్స్లు, గ్రాండ్ సెట్స్తో పాటు ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రియల్ యానిమల్స్తో చిత్రీకరిస్తున్న క్లిష్టమైన సన్నివేశాల వెనుక చిత్రబృందం పడుతున్న శ్రమను కూడా ఈ డాక్యుమెంటరీలో చూపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అలాగే షూటింగ్ సమయంలో చోటుచేసుకున్న ఆసక్తికర సంఘటనలు, భారీ యాక్షన్ సన్నివేశాలను రూపొందించిన విధానం, నటీనటుల అనుభవాలు, సాంకేతిక నిపుణుల కృషి వంటి అంశాలను ఇందులో పొందుపరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో సినిమా మేకింగ్ ప్రక్రియను ప్రేక్షకులు మరింత దగ్గరగా చూసే అవకాశం దక్కనుంది.
ఈ డాక్యుమెంటరీకి ప్రముఖ డాక్యుమెంటరీ దర్శకుడు గోగితా చిక్వైర్జే పనిచేస్తున్నట్లు IMDbలోని వివరాల ఆధారంగా వార్తలు వెలువడ్డాయి. అయితే దీనిపై ‘వారణాసి’ చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న సినిమా నిర్మాణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసే ఉద్దేశంతోనే ఈ డాక్యుమెంటరీని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ మేకింగ్ డాక్యుమెంటరీని సినిమా విడుదలకు ముందే ప్రమోషనల్ కంటెంట్గా తీసుకురావాలా? లేక మూవీ రిలీజ్ తర్వాత ప్రత్యేక ఫీచర్గా అందించాలా? అనే అంశంపై మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. సినిమాలో భాగమైన నటీనటులు, టెక్నీషియన్ల కృషిని ప్రేక్షకులకు చూపించడమే దీని ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.
మహేశ్ బాబు-ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా కావడంతో ‘వారణాసి’పై ఇప్పటికే భారీ హైప్ ఉంది. ఇప్పుడు ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ మేకింగ్పై ప్రత్యేక డాక్యుమెంటరీ రూపొందిస్తున్నారనే వార్త సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. అయితే ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

