ప్రపంచ వింతల్లో ఒకటిగా పేరొందిన తాజ్మహల్ను పగటిపూట సందర్శించడం ఓ అద్భుతమైన అనుభూతి అయితే.. పౌర్ణమి వెన్నెల్లో తెల్లటి పాలరాతి కట్టడం అందాలను వీక్షించడం మరింత ప్రత్యేకం. చల్లని వెన్నెల కాంతుల్లో తాజ్మహల్ శోభను ఆస్వాదించేందుకు పర్యాటక శాఖ ప్రత్యేకంగా నైట్ విజిట్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. మీరు కూడా పౌర్ణమి రాత్రి తాజ్మహల్ను సందర్శించాలని భావిస్తే.. ముందుగా సందర్శన సమయాలు, టికెట్ ధరలు, ఆన్లైన్ బుకింగ్ విధానం, ఇతర నిబంధనల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ప్రపంచంలోని సప్త అద్భుతాలలో ఒకటైన ఆగ్రాలోని తాజ్ మహల్ను మీరు రాత్రిపూట సందర్శించవచ్చు. ఈ సమయంలో అక్కడ రద్దీ ఉండదు. దానిని చూడటానికి మీకు పూర్తి 30 నిమిషాల సమయం లభిస్తుంది. ఈ క్షణంలోనే మీరు తాజ్ మహల్ను వెన్నెలలో చూస్తారు. ఆ వెలుగు వెండిలా తెల్లగా ఉన్నప్పటికీ, లేత నీలం లేదా ముత్యంలా మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రజలు ఈ దృశ్యం కోసం వారాల తరబడి ఎదురుచూస్తారు. కానీ, కొద్దిమంది మాత్రమే దీనిని చూడగలుగుతారు..ఎందుకంటే దీనిని చూసే అవకాశం నెలకు ఐదు రోజులు మాత్రమే లభిస్తుంది. అవును..వెన్నెల వెలుగుల్లో ప్రసిద్ధ తాజ్మహల్ను సందర్శించాలనుకునే పర్యాటకుల కోసం పౌర్ణమి రాత్రి వేళల్లో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రత్యేక అవకాశం కల్పిస్తోంది.టికెట్ ధరలు:
పగటిపూట తాజ్మహల్ సందర్శన టికెట్లతో పోలిస్తే, రాత్రి వేళ నైట్ వ్యూయింగ్ టికెట్ల ధరలు భిన్నంగా ఉంటాయి. భారతీయ వయోజనులకు రూ.510, విదేశీ పర్యాటకులకు రూ.750గా నిర్ణయించారు. 3 నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకు భారతీయులు, విదేశీయులు అనే తేడా లేకుండా రూ.500 టికెట్ ధర వర్తిస్తుంది.
బుకింగ్ ప్రక్రియ, ముఖ్యమైన నిబంధనలు:
నైట్ వ్యూయింగ్ టికెట్లను ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అధికారిక వెబ్సైట్ ద్వారా సందర్శన తేదీకి 7 రోజుల ముందు నుంచే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. టికెట్లు పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండటంతో ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది.
పర్యాటకులు తమకు కేటాయించిన సమయానికి కనీసం 30 నిమిషాల ముందుగా తాజ్మహల్ తూర్పు గేటు వద్దకు చేరుకోవాలి. అక్కడ భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాతే ప్రవేశానికి అనుమతిస్తారు. రాత్రి వేళ భద్రతా నిబంధనలు కఠినంగా ఉంటాయి. మొబైల్ ఫోన్లు, వీడియో కెమెరాలు, ట్రైపాడ్లు, అదనపు బ్యాటరీలను లోపలికి అనుమతించరు. సాధారణ కెమెరాలను మాత్రమే నిబంధనలకు అనుగుణంగా తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది.
నైట్ వ్యూయింగ్ సమయాలు, రోజులు:
తాజ్మహల్ నైట్ వ్యూయింగ్ ప్రతి నెలా కేవలం ఐదు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. పౌర్ణమి రోజుతో పాటు దానికి రెండు రోజుల ముందు, రెండు రోజుల తర్వాత ఈ అవకాశం ఉంటుంది. అయితే, ప్రతి శుక్రవారం తాజ్మహల్ మూసివేసి ఉంటుంది. కాబట్టి ఆ రోజు నైట్ వ్యూయింగ్ ఉండదు. అలాగే రంజాన్ మాసంలో కూడా రాత్రి సందర్శనను అనుమతించరు.
రాత్రి సందర్శన సమయం 8:30 PM నుండి అర్ధరాత్రి 12:30 AM వరకు ఉంటుంది. రాత్రివేళ రద్దీని నివారించడానికి పర్యాటకులను 8 బ్యాచ్లుగా విడదీస్తారు. ప్రతి బ్యాచ్కు 30 నిమిషాల సమయం కేటాయిస్తారు. ఒక రోజుకు గరిష్టంగా 400 మంది పర్యాటకులను ప్రతి బ్యాచ్కు 50 మంది మాత్రమే అనుమతిస్తారు.
