
సైబర్ నేరాలను ఎదుర్కోవడంలో తెలంగాణ సైబర్ పోలీసులు దేశంలోనే ముందంజలో ఉన్నారని ప్రముఖ నటుడు నాగార్జున ప్రశంసించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో నిర్వహించిన ‘సురక్షా కా తిరంగా’ సైబర్ అవగాహన కార్యక్రమానికి డీజీపీ సీవీ ఆనంద్తో కలిసి నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సైబర్ మోసాలపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తనకు కూడా గతంలో సైబర్ నేరగాళ్ల నుంచి మోసపూరిత ప్రయత్నం ఎదురైందని నాగార్జున తెలిపారు. సుమారు ఐదేళ్ల క్రితం ఓ వ్యక్తి బ్యాంకు అధికారిగా పరిచయం చేసుకుని పెట్టుబడుల పేరుతో తనను మోసం చేసేందుకు ప్రయత్నించాడని చెప్పారు. అంతేకాకుండా విదేశాలకు మాదకద్రవ్యాల పార్సిల్ పంపారంటూ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా డిజిటల్ అరెస్ట్ పేరుతో తన కుటుంబ సభ్యులను కూడా నేరగాళ్లు భయపెట్టిన విషయాన్ని నాగార్జున గుర్తుచేశారు. దాదాపు 6 నుంచి 7 గంటల పాటు వారిని మోసపూరితంగా భయాందోళనకు గురిచేశారని తెలిపారు.
డిజిటల్ భద్రతపై అప్రమత్తత అవసరం
తాను ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే కంప్యూటర్ల వినియోగం ప్రారంభమైందని నాగార్జున గుర్తుచేసుకున్నారు. అప్పట్లోనే మాల్వేర్, హ్యాకింగ్ వంటి సైబర్ ముప్పులపై ప్రొఫెసర్లు హెచ్చరించేవారని చెప్పారు. టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా సైబర్ నేరాల సమస్య మాత్రం కొనసాగుతూనే ఉందన్నారు.
ప్రతి ఒక్కరూ తమ డిజిటల్ ఖాతాలు, వ్యక్తిగత సమాచారాన్ని భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. పాస్వర్డ్లను క్రమం తప్పకుండా మార్చుకోవడంతో పాటు.. మొబైల్, వైఫై వంటి డిజిటల్ పరికరాల భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. తాను కూడా ముందస్తు జాగ్రత్తగా మొబైల్ పాస్వర్డ్ను తరచూ, వైఫై పాస్వర్డ్ను క్రమం తప్పకుండా మార్చుకుంటానని వెల్లడించారు.
తెలంగాణ పోలీసులపై ప్రశంసలు
సైబర్ నేరాలను అరికట్టడంలో తెలంగాణ పోలీసులు చేస్తున్న కృషిని నాగార్జున అభినందించారు. నేరగాళ్లను పట్టుకునేందుకు అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్యలు తీసుకుంటున్న తెలంగాణ పోలీసుల పనితీరును ప్రశంసించారు.
అదేవిధంగా తెలుగు చిత్ర పరిశ్రమలో పైరసీని నియంత్రించేందుకు ఐపీఎస్ అధికారులు సీవీ ఆనంద్, సజ్జనార్ చేసిన కృషిని కూడా నాగార్జున కొనియాడారు. తెలంగాణ పోలీసులు తీసుకున్న కఠిన చర్యలు తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా సినీ రంగానికి ప్రయోజనం చేకూర్చాయని పేర్కొన్నారు.
సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు.. అప్రమత్తతే మోసాలను నివారించడానికి ప్రధాన మార్గమని నాగార్జున సూచించారు.

