
ఉరవకొండ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఈ నెల 9 నుంచి అక్టోబర్ 8 వరకు 9వ మాసోత్సవాలను నిర్వహించనున్నట్లు ప్రాజెక్టు సీడీపీవో డా. బి.ఎన్. శ్రీదేవి తెలిపారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలకు పోషకాహారం, ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం ప్రాధాన్యతను వివరించడంతో పాటు చిన్నారులకు అందించే పోషకాహారం, వారి ఎదుగుదలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పిల్లల ఎత్తు, బరువులను నమోదు చేసి వృద్ధి లోపాలను గుర్తించడంతో పాటు రక్తహీనత నివారణకు ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం మాత్రల వినియోగంపై అవగాహన కల్పించనున్నారు. గర్భిణులు, బాలింతలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించనున్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ-స్కూల్ కార్యకలాపాలతో పాటు పరిశుభ్రత, సురక్షిత తాగునీరు, మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన కల్పించనున్నారు. కిశోర బాలికలకు పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత, రక్తహీనత నివారణపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే బాల్య వివాహాల నివారణ, బాలల హక్కులు, పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు.
పిల్లలకు తల్లిదండ్రులు సమతుల్య ఆహారం అందించేలా అవగాహన కల్పించడంతో పాటు గ్రామస్థాయిలో పోషకాహారం, ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నట్లు సీడీపీవో తెలిపారు. మాసోత్సవాలను విజయవంతం చేసేందుకు అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, సంబంధిత శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు.
‘ఆరోగ్యవంతమైన తల్లి–ఆరోగ్యవంతమైన శిశువు–బలమైన కుటుంబం’ అనే లక్ష్యంతో ప్రతి కుటుంబానికి పోషకాహారం, ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించడమే 9వ మాసోత్సవాల ప్రధాన ఉద్దేశ్యమని డా. బి.ఎన్. శ్రీదేవి తెలిపారు.
