
విశాఖపట్నం, జులై 14: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. విశాఖ పర్యటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు స్పందించారు. ఈరోజు(మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ. ఇప్పటికైనా గొడ్డలి పార్టీ అధ్యక్షుడు శవ రాజకీయాలు మానుకోవాలని హితవుపలికారు.
నేడు జగన్ రెడ్డి. విశాఖపట్నానికి ఎందుకు వస్తున్నారో ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఒక్క మత్స్యకారుడికి కూడా న్యాయం చేయలేదని విమర్శించారు. వారికి చట్ట ప్రకారం చెల్లించాల్సిన బకాయిలను చెల్లించలేదన్నారు.
అసలు మత్స్యకారులకు జగన్ రెడ్డి ఏం చేశారో సమాధానం చెప్పాలని పల్లా అన్నారు. మత్స్యకార నిధులను కూడా జగన్ డైవర్ట్ చేశారని ఆరోపించారు. ఇప్పుడు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడి ప్రమాద ఘటన గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ మత్స్యకారులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. జగన్ రాజకీయాలు చేయడం కోసమే విశాఖకు వస్తున్నారని పల్లా శ్రీనివాస రావు వ్యాఖ్యానించారు.

