యూరియా కోసం రైతులు తెల్లవారుజాము నుంచే ఆగ్రోస్‌ కేంద్రాలు, సహకార సంఘాలు, ఎరువుల దుకాణాల ముందు గంటల తరబడి బారులు తీరాల్సిన అవసరం ఇక ఉండదు. యూరియా కోసం రైతులు తెల్లవారుజాము నుంచే ఆగ్రోస్‌ కేంద్రాలు, సహకార సంఘాలు, ఎరువుల దుకాణాల ముందు గంటల తరబడి బారులు తీరాల్సిన అవసరం ఇక ఉండదు. రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, యూరియా పంపిణీ వ్యవస్థను ప్రభుత్వం మరింత సులభతరం చేసింది.

గత యాసంగిలో ప్రవేశపెట్టిన యాప్‌ ద్వారా బుకిం గ్‌ విధానంలో వ్యవసాయ శాఖ అధికారులు మార్పులు చేశారు. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ వానాకాలం సీజన్‌లో సిద్దిపేట జిల్లాలో 5.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కానున్నాయని అంచనా. దీనికి గాను 45,933 మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరమని గుర్తించారు.

ప్రస్తుతం జిల్లాలో 9 వేల మెట్రిక్‌ టన్నుల స్టాక్‌ అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో యాప్‌ ద్వారా 2,52,960 బస్తాల యూరియాను రైతులు కొనుగోలు చేశారు. రైతుల భూవిస్తీర్ణాన్ని బట్టి యూరియా బుకింగ్‌ చేసుకునేలా దశలవారీ విధానాన్ని అమలు చేస్తున్నారు గతంలో మూడు విడతలుగా (15 రోజుల వ్యవధిలో) బుకింగ్‌ చేసుకోవాల్సి వచ్చేది. ఇకపై రెండెకరాల పట్టా ఉన్న రైతులు ఒకేసారి బుకింగ్‌ చేసుకొని యూరియా తీసుకోవచ్చు. 2ఎకరాల నుంచి 5 ఎకరాలు ఉన్న వారు తమ బుకింగ్‌ను రెండు విడతలుగా చేసుకోవాలి.

ఐదు ఎకరాలు, ఆపైన ఉన్న వారు మూడు విడతలుగా బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక బుకింగ్‌కు, మరో బుకింగ్‌కు మధ్య 20 రోజుల సమయం ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ మార్పుల వల్ల రైతులకు యూరియా సకాలంలో అందడమే కాకుండా, సాగు ప్రణాళికలు రూపొందించుకోవడానికి వీలు కలుగుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూప రాణి పేర్కొన్నారు.

By Rajini