
కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్డేట్ చెప్పింది. ఆగస్ట్ 15 నుంచి కొత్త పింఛన్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఒంటరి మహిళలు, వితంతువులకు కొత్త పెన్షన్లు అందించనున్నట్లు వెల్లడించారు. ఇక పింఛన్ లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. పెన్షన్ల జాబితా నుంచి అనర్హుల పేర్లను ఏరివేసి.. అర్హులకే అందించేలా చర్యలు చేపడుతున్నారు.
తెలంగాణలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్హులైన ఒంటరి మహిళలు, వితంతువులు సహా కొత్త లబ్ధిదారులకు ఆగస్ట్ 15వ తేదీ నుంచి పింఛన్లు అందజేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆమె వెల్లడించారు.
ములుగు జిల్లా పర్యటన సందర్భంగా మాట్లాడిన మంత్రి సీతక్క.. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన, కుటుంబ ఆధారం లేక ఒంటరిగా జీవిస్తున్న మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలని భావిస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు

