
హైదరాబాద్లో జరిగిన ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (FLO) మహిళా పారిశ్రామికవేత్తల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్రను కొనియాడిన ఆయన, 2023లో ప్రజా ప్రభుత్వం ఏర్పడటానికి మహిళల ఆశీస్సులు, మద్దతే ప్రధాన కారణమని కృతజ్ఞతలు తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా ప్రభుత్వం తీసుకుంటున్న పలు విప్లవాత్మక నిర్ణయాలను ఈ వేదికగా సీఎం పంచుకున్నారు.
ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సాధికారతకు సంబంధించి కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రంలోని 67 లక్షల మహిళా సంఘాలకు ఇప్పటికే రూ.16 వేల కోట్ల రుణాలు అందించామని, వారి ఉత్పత్తులను అమెజాన్ ద్వారా ప్రపంచ మార్కెట్కు అనుసంధానిస్తామని తెలిపారు. 2034 నాటికి తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఫక్కీ వేధికగా సీఎం రేవంత్ మహిళ సంఘాలకు పలు కీలక హామీలు ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే.
మహిళా స్వయం సహాయక సంఘాలను కార్పొరేట్ స్థాయిలో బలోపేతం చేసేందుకు రాష్ట్రంలోని 22 జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇవి మహిళలకు వ్యాపార శిక్షణ, మార్కెటింగ్ కార్యకలాపాలకు కేంద్రాలుగా మారుతాయన్నారు. అలాగే, శిల్పారామం సమీపంలో రూ.1,000 కోట్ల విలువైన అత్యంత ఖరీదైన స్థలాన్ని ఇందిరా మహిళా శక్తి బజార్ కోసం కేటాయించామని, ఇక్కడ గ్రామీణ హస్తకళలు, సంప్రదాయ ఉత్పత్తుల విక్రయానికి 150కి పైగా దుకాణాలు విజయవంతంగా నడుస్తున్నాయని వెల్లడించారు.

