
ఐటీ షేర్లపై మదుపర్లు ఆసక్తి చూపుతుండడం సూచీలకు కలిసొస్తోంది. బుధవారం ఐటీ సెక్టార్ ఏకంగా 2.5 శాతం పెరిగింది. మరోవైపు మంగళవారం విదేశీ మదుపర్లు రూ.755 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లను యథాతధంగా ఉంచబోతున్నట్టు వస్తున్న వార్తలు కూడా సానుకూలంగా మారాయి. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (95.76) బలపడింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాల్లో కదలాడుతున్నాయి.
గత సెషన్ ముగింపు (76,765)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 600 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి ఎగబాకింది. ఉదయం 9:40 గంటల సమయంలో సెన్సెక్స్ 761 పాయింట్ల లాభంతో 77,527 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 219 పాయింట్ల లాభంతో 24,204 వద్ద ఉంది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో కేపీఐటీ టెక్, స్విగ్గీ, కొఫోర్జ్, సెయిల్, ఇన్ఫోసిస్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). ఫియోనిక్స్ మిల్స్, మదర్సన్, కేఫిన్ టెక్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, సీజీ పవర్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 287 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 396 పాయింట్ల లాభంతో ఉంది.

