
ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ ముసాయిదా ఓటరు జాబితాను అధికారులు విడుదల చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి అయిన నేపథ్యంలో ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించారు. అభ్యంతరాల స్వీకరణకు ఆగస్ట్ 30వ తేదీ వరకూ గడువు ఇచ్చారు. అక్టోబర్ మూడో తేదీన తుది జాబితా ప్రకటిస్తారు. మరోవైపు రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో 89.22 శాతం మంది ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించినట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ తెలిపారు. 3.71 కోట్ల మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు అందించినట్లు వెల్లడించారు. ఏపీ ఎన్నికల సంఘం అధికారిక వెబ్ సైట్ ద్వారా ముసాయిదా ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకునే అవకాశం కల్పించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ముసాయిదా ఓటరు జాబితాను అధికారులు విడుదల చేశారు. ఈ వివరాలను ఏపీ ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వివేక్ యాదవ్ వెల్లడించారు. లో భాగంగా 3.71 కోట్ల మంది తమ ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించినట్లు వివేక్ యాదవ్ తెలిపారు. మొత్తం 4.16 కోట్ల మంది ఓటర్లలో 89.22 శాతం మంది ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించినట్లు తెలిపారు. ఓటరు జాబితాలోని 15.22 లక్షల మందిని మృతులుగా గుర్తించినట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలోని 22.30 లక్షల మంది ఓటర్లు ఎస్ఐఆర్ ప్రక్రియకు గైర్హాజరు కావడమో.. శాశ్వతంగా నివాసాలు మారడమో జరిగినట్లు తెలిపారు. అలాగే 7.37 లక్షల మంది రెండు, మూడు చోట్ల ఓటర్లుగా నమోదైనట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ తెలిపారు.
మరోవైపు ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాలలో ఓటు ఉన్నవారి పేరును ఒకేచోట కొనసాగించామని వివేక్ యాదవ్ తెలిపారు. ఫారం -6తో నిజమైన ఓటర్లు మరోసారి నమోదు చేసుకునే వీలుందని వెల్లడించారు. ముసాయిదా ఓటరు జాబితాపై నేటి నుంచి (జులై 31) ఆగస్ట్ 30వ తేదీ వరకూ అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపారు. వీటిని పరిశీలించిన అనంతరం.. అక్టోబర్ 3న తుది ఓటరు జాబితా ప్రకటించనున్నట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ వివరించారు. మరోవైపు నోటీసు, విచారణ లేకుండా ఓటర్ జాబితాలో నుంచి ఎవరి పేరును కూడా తొలగించబోమని అధికారులు స్పష్టం చేశారు.

