
తెలంగాణలో రూ.40,769 కోట్లతో 21 ప్రధాన రైల్వే ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో తెలిపారు. ఆరు కొత్త రైల్వే లైన్లు, 15 ట్రాక్ డబ్లింగ్ ప్రాజెక్టుల్లో ఇప్పటివరకు 677 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయని చెప్పారు. అయితే భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారి పలు ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయన్నారు. రాష్ట్రంలో కొత్త రైలు సర్వీసులు, కార్గో టెర్మినళ్లు, రైల్వే ఓవర్ బ్రిడ్జిల అభివృద్ధి కూడా కొనసాగుతోందని కేంద్రం వెల్లడించింది.
తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగంగా కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.40,769 కోట్ల అంచనా వ్యయంతో 21 ప్రధాన రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లోఅమలులో ఉన్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో రైల్వే అనుసంధానం, సరకు రవాణా సామర్థ్యం, ప్రయాణికుల సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం తెలంగాణలో ఆరు కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులు, 15 ట్రాక్ డబ్లింగ్ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. వీటి మొత్తం పొడవు 2,347 కిలోమీటర్లు. ఇందులో ఇప్పటివరకు 677 కిలోమీటర్ల పనులు పూర్తయ్యి ప్రారంభించగా, ఈ ఏడాది మార్చి నాటికి రూ.12,105 కోట్ల వ్యయం జరిగినట్లు కేంద్రం వెల్లడించింది. మిగిలిన పనులను కూడా దశలవారీగా పూర్తి చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది.
ప్రస్తుతం కొనసాగుతున్న కీలక ప్రాజెక్టుల్లో భద్రాచలం మీదుగా మల్కన్గిరి–పాండురంగపురం 174 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ ముఖ్యమైనది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.3,592 కోట్లు. అలాగే సికింద్రాబాద్–వాడి మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి రూ.5 వేల కోట్లకు పైగా ఖర్చు చేయనున్నారు. మునిరాబాద్–మహబూబ్నగర్ కొత్త రైల్వే లైన్ కూడా మరో కీలక ప్రాజెక్టుగా కొనసాగుతుండగా.. దీని అంచనా వ్యయం దాదాపు రూ.4 వేల కోట్లుగా ఉంది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలో రైల్వే కనెక్టివిటీ మరింత బలోపేతం కానుంది.
అయితే ఈ ప్రాజెక్టుల అమలులో భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారిందని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం కొనసాగుతున్న పనులకు మొత్తం 2,792 హెక్టార్ల భూమి అవసరమవుతుండగా.. ఇప్పటివరకు 1,772 హెక్టార్లు మాత్రమే సేకరించగలిగారు. ఇంకా 1,020 హెక్టార్ల భూమి అందుబాటులోకి రావాల్సి ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా గుంటూరు–బీబీనగర్ డబ్లింగ్, ముద్ఖేడ్–మేడ్చల్, మహబూబ్నగర్–డోన్ డబ్లింగ్ ప్రాజెక్టులు భూసేకరణ ఆలస్యం కారణంగా మందగించినట్లు తెలిపారు.

