
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక సదుపాయాల విస్తరణకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. సమావేశం అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరాలు వెల్లడించారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్-2026’, ‘పీపీపీ పాలసీ-2026’ ముసాయిదాలకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. అలాగే దిశా బిల్లు-2019, ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు-2024లను ఉపసంహరించుకుని, వాటి స్థానంలో మరింత సమర్థవంతమైన కొత్త చట్టాలను తీసుకురావాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల (UDAలు) పునర్వ్యవస్థీకరణతో పాటు పాదచారుల భద్రత పాలసీ-2026కు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు.
అదే విధంగా అమరావతిలో ప్రపంచస్థాయి పర్యాటక ఆకర్షణగా ‘అమరావతి ఐ’ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో గ్రీన్ పార్కుల అభివృద్ధికి అవసరమైన భూ కేటాయింపులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి వెల్లడించారు. రానున్న గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం రూ.210 కోట్ల విడుదలకు కూడా కేబినెట్ అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. పుష్కరాల ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఐదుగురు ఐఏఎస్ అధికారులను ప్రత్యేకంగా నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు చెప్పారు.
కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై పలు రాజకీయ, పరిపాలనా అంశాలపై చర్చించారు. రాజకీయాల పేరుతో కొందరు నేరాలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించిన సీఎం, డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ప్రజల్లో వాస్తవాలతో తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు. డీఎస్సీ ప్రక్రియకు సంబంధించిన అన్ని వివరాలను ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు స్పష్టంగా తెలియజేసిందని పేర్కొన్నారు. అలాగే హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్లపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. ఈ అంశంపై కోర్టులు కూడా వైసీపీ వైఖరిని తప్పుబట్టినప్పటికీ, దుష్ప్రచారం కొనసాగించడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.
అదేవిధంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్రలపై కూడా చంద్రబాబు విమర్శలు చేశారు. జగన్ పర్యటించిన ప్రాంతాల్లో ఆస్తుల ధ్వంసం, రైతుల పంటలకు నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు. ఈ విషయాన్ని పలువురు రైతులు నేరుగా తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. దీంతో జగన్ పరామర్శలు అంటేనే ప్రజల్లో ఆందోళన నెలకొనే పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.

