
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా మూడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల (పట్టణాభివృద్ధి సంస్థలు)కు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మార్కాపురం, భీమవరం, నంద్యాల కేంద్రలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొత్త జిల్లాల పరిధికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వం ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ కేబినెట్లో చర్చించి ఆమోదం తెలియజేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలో మరో మూడు పట్టణాలను అభివృద్ధి చేసేందుకు సిద్ధమైంది. భీమవరం, మార్కాపురం, నంద్యాల పట్టణాభివృద్ధి సంస్థలు (యూడీఏ) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమీపంలోని యూడీఏ (అర్బన్ డెవలప్మెంట్) పరిధిలో కొంత ప్రాంతాన్ని విభజించి కొత్తగా ఏర్పాటు చేస్తున్న యూడీఏల్లో చేర్చారు. విశాఖపట్నం, కాకినాడకు సంబంధించి కూడా కీలక మార్పులు చేశారు. విశాఖపట్నం వీకేపీసీపీఐఆర్ ( పెట్రోలియం, కెమికల్, పెట్రో కెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ)ను రద్దు చేశారు.. ఆ పరిధిలోని ప్రాంతాలను వీఎంఆర్డీఏ (విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) చేర్చనున్నారు. కాకినాడ కెమికల్, పెట్రో కెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీని.. కాకికాడ పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో చేర్చనున్నారు. ఈ తాజా నిర్ణయంతో రాష్ట్రంలో మొత్తం యూడీఏల సంఖ్య 23కు చేరనుంది. కొత్త జిల్లాల పరిధికి అనుగుణంగా పట్టణాభివృద్ధి సంస్థలను పునర్వ్యవస్థీకరిస్తున్నారు. ఈ మేరకు కేబినెట్ సమావేశంలో ఆమోదించారు.
మార్కాపురం పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో.. 21 మండలాలు, నాలుగు మున్సిపాలిటీలు (గిద్దలూరు, మార్కాపురం, పొదిలి, కనిగిరి) ఉంటాయి. యూడీఏ విస్తీర్ణం 6,037.39 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. భీమవరం పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో.. 19 మండలాలు, ఆరు మున్సిపాలిటీలు (భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకివీడు ఉంటాయి. మొత్తం 2,164.52 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. నంద్యాల పట్టణాభివృద్ధి విషయానికి వస్తే.. 26 మండలాలు, ఆరు మున్సిపాలిటీలు (నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్, నిందకొట్కూరు, ఆత్మకూరు, బేతంచర్ల) ఉన్నాయి. మొత్తం 6,676.11 చదరపు కిలోమీటర్లు ఉంటుంది.
రాష్ట్రంలో పాదచారుల మరణాలను నివారించేందుకుఫుట్పాత్లపై ఆక్రమణలు తొలగించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. పాదచారుల కోసం ఆక్రమణలు తొలగించేందుకు కొత్త విధానానికి, ఆపరేషనల్ గైడ్లైన్స్ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ పరిధిలో ఉన్న జోన్ 14, వార్డు నంబరు 35లో ఉన్న వెలంపేట మురికివాడను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అక్కడ ఉన్న కుటుంబాలకు అక్కడే పునరావాసం కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు. అక్కడ స్టిల్ట్+12 అంతస్తుల భవనం షీర్వాల్ టెక్నాలజీతో నిర్మించనున్నారు. రెండేళ్లలో పీపీపీ విధానంలో దీనిని పూర్తిచేస్తారు.

