
అమరావతి, ఆగస్టు 7: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అగ్నికుల క్షత్రియుల జాతిపిత పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పొన్నమండ వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి సవిత ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం అభివృద్ధికి లక్ష్మణ స్వామి విశేష సేవలు అందించారన్నారు.
అగ్నికుల క్షత్రియుల సామాజిక వర్గంతో పాటు పేదల అభ్యున్నతికి విశేష కృషి చేసిన సంఘ సంస్కర్త అని కొనియాడారు. ఆయుర్వేద వైద్య రంగంలోనూ పొన్నమండ వర్మ విశేష సేవలు అందించారన్నారు. 120 రకాల ఔషధాలను తయారు చేసి దేశ విదేశాలకు సరఫరా చేసిన మహనీయుడు అని మంత్రి పేర్కొన్నారు. సమాజంలో అగ్నికుల క్షత్రియ సమాజానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని తెలిపారు.
1927లో జీవో నం. 271 ద్వారా అగ్నికుల క్షత్రియులకు అధికారికంగా గుర్తింపునిచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం పొన్నమండ వర్మ జయంతిని అధికారిక రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయించడం సమాజానికి దక్కిన గొప్ప గౌరవంగా అభిప్రాయపడ్డారు. భావితరాలకు పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ సేవలు తెలియజేయాలన్న లక్ష్యంతో ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామన్నారు. పొన్నమండ వర్మ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడంపై సీఎం చంద్రబాబు నాయుడుకు మంత్రి సవిత ధన్యవాదాలు తెలియజేశారు.

