
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఏపీ మోడల్ స్కూల్స్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును మరో రెండేళ్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ మోడల్ స్కూళ్ల ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు ప్రస్తుతం ఉన్న 60 ఏళ్లుగా ఉండగా.. 62 ఏళ్లకు పెంచారు. ఏపీ మోడల్ స్కూల్స్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి ఈ నిబంధన వరిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మోడల్ స్కూల్స్లో పనిచేసే టీచర్లు, ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. మోడల్ స్కూల్స్లో ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక శాఖ జారీ చేసిన జీవో నంబర్ 45కు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ జీవో నంబర్ 18ని విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూల్స్లోని ప్రతి ఉద్యోగికి ఈ పదవీ విరమణ వయసు పెంపు వర్తిస్తుందని తెలిపారు. వెంటనే ఈ ఉత్తర్వుల అమలుకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించారు. ఈ తాజా నిర్ణయంతో మోడల్ స్కూల్స్ సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంపై ఎస్టీయూ, మోడల్స్కూల్ ప్రోగ్రెసివ్ టీచర్ అసోసియేషన్లు హర్షం వ్యక్తం చేశాయి.
గత ప్రభుత్వం హయాంలో ఉద్యోగుల పదవీవిరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచిన సంగతి తెలిసిందే. కానీ రాష్ట్రంలోని షెడ్యూల్ 9, 10 సంస్థల్లో, కార్పొరేషన్లు, సొసైటీలు, గురుకులాలు, ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులకు ఈ నిబంధనను వర్తింపచేయలేదు. ఉద్యోగులు తమకు కూడా పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని కోరారు.. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశాన్ని పరిశీలించింది. మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసి సాధాసాధ్యాలపై చర్చించారు. అనంతరం కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదించారు. 2022 జనవరి నుంచి ఈ నిబంధన వర్తించేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఇప్పటికే ఎవరైనా పదవీ విరమణ పొంది ఉంటే.. ఆ ఉద్యోగుల్ని ఆయా సంస్థల్లో తిరిగి తీసుకోవాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అలా తిరిగి ఉద్యోగాల్లో చేరిన వారు 62 ఏళ్ల వరకు కొనసాగిస్తారు.
తాజా ఆదేశాలతో గత నెలలో రిటైర్ అయిన ఉద్యోగి తిరిగి ఉద్యోగంలో చేరారు. ఏపీ ఆర్కైవ్స్ విశ్రాంత డైరెక్టర్ వి.రంగరాజ్ పదవీ విరమణ చేయగా.. మళ్లీ ఆయన్ను విధుల్లోకి తీసుకున్నారు. జూన్ 30 నాటికి 60 ఏళ్లు పూర్తి కావడంతో ఆయన రిటైర్ అయ్యారు. ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2022 జనవరి 1 నుంచి వర్తిస్తాయని చెప్పడంతో.. పదో షెడ్యూల్ పరిధిలోని ఏపీ ఆర్కైవ్స్ విభాగంలో పనిచేస్తున్న రంగరాజ్ మళ్లీ ఉద్యోగంలో చేరేందుకు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు. వెంటనే ప్రభుత్వం ఆయన్ను తిరిగి విధుల్లోకి తీసుకుంది. అలా శాఖలవారీగా అధికారులు పదవీ విరమణ వయసు పెంపుపై ఉత్తర్వులు జారీ చేస్తున్నారు.

