
విజయవాడలో విజయ డెయిరీ చైర్మన్ ఎన్నిక వ్యవహారం అధికార తెలుగుదేశం పార్టీలో కొత్త రాజకీయ చర్చకు దారితీసింది. పార్టీ సూచనలను పట్టించుకోకుండా డైరెక్టర్ పదవికి నామినేషన్ దాఖలు చేసి.. అనంతరం ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నికైన చలసాని ఆంజనేయులు వ్యవహారాన్ని టీడీపీ అధిష్ఠానం సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో విజయ డెయిరీ అంశంలో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం చలసాని ఆంజనేయులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
విజయ డెయిరీ డైరెక్టర్ పదవికి నామినేషన్ వేయవద్దని పార్టీ పెద్దలు సూచించినప్పటికీ.. చలసాని ఆంజనేయులు నామినేషన్ దాఖలు చేసినట్లు సమాచారం. అనంతరం ఆయన ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నికయ్యారు. పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా ఆయన వ్యవహరించడంపై టీడీపీ నాయకత్వం అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని మంత్రులు సారధి, కొల్లు రవీంద్ర చలసానిపై ఒత్తిడి తెచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పార్టీ ఆదేశాలను ధిక్కరించిన అంశాన్ని అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. ఈ పరిణామాల మధ్య చలసాని ఆంజనేయులు ఆస్పత్రిలో చేరడం రాజకీయంగా మరింత చర్చనీయాంశంగా మారింది. మరోవైపు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గత కొంతకాలంగా చలసాని ఆంజనేయులుపై పలు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. విజయ డెయిరీ వ్యవహారంలోనూ వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది.
తాజాగా చలసాని ఆంజనేయులు విజయ డెయిరీ చైర్మన్గా ఎన్నిక కావడం.. అదే సమయంలో పార్టీ అధిష్ఠానం నుంచి రాజీనామా చేయాలంటూ ఒత్తిడి వచ్చినట్లు వార్తలు రావడంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. చైర్మన్గా ఎన్నికైన వెంటనే చోటుచేసుకున్న పరిణామాలతో విజయ డెయిరీ అంశం టీడీపీలో హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం చలసాని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో.. పార్టీ నాయకత్వం తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? చైర్మన్ పదవిపై ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

