
ఓ వృద్ధురాలి ఆకాంక్షను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెరవేర్చారు. తనను కలిసి ఫొటో దిగాలన్న ఆ వృద్ధురాలి కోరికను ఆయన తీర్చారు. అలాగే ఇదే సమయంలో ఇచ్చిన మాట ప్రకారం శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ చేనేత కుటుంబాన్ని ఆయన కలిశారు.
ఓ వృద్ధురాలి ఆకాంక్షను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెరవేర్చారు. తనను కలిసి ఫొటో దిగాలన్న ఆ వృద్ధురాలి కోరికను ఆయన తీర్చారు. ఇదే సమయంలో ఇచ్చిన మాట ప్రకారం శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ చేనేత కుటుంబాన్నీ ముఖ్యమంత్రి కలిశారు. ఇటీవల చీరాలకు చెందిన పుష్పావతి అనే వృద్ధురాలు సీఎం చంద్రబాబును కలవాలనే తన ఆకాంక్షను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను కొంతమంది సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది వైరల్ అయ్యింది.
ఆ వీడియో కాస్తా సీఎం చంద్రబాబు దృష్టికి రావడంతో వృద్ధురాలి ఆకాంక్షను నెరవేర్చాలని భావించారు. అంతర్జాతీయ చేనేత దినోత్సవం నాడు ఆమెను చీరాలలో కలిసి మాట్లాడతానంటూ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఈ మేరకు నేడు చీరాలలో తన అభిమాని అయిన ఆ వృద్ధురాలిని ముఖ్యమంత్రి కలిశారు. ఆప్యాయంగా పలకరించి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె కోరిక మేరకు ఫొటో దిగారు. సీఎం చంద్రబాబుతో ఫొటో దిగడంపై ఆ వృద్ధురాలు సంతోషం వ్యక్తం చేశారు. జీవితకాల కోరిక నెరవేరిందంటూ సంబరపడ్డారు.
మరోవైపు, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన చేనేత కుటుంబం నాగేశ్వరరావు, లక్ష్మి దంపతులను కూడా సీఎం చంద్రబాబు కలిశారు. వారి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో చేనేత దినోత్సవం రోజు కలుస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం వారిని నేడు చీరాలలో ముఖ్యమంత్రి కలిశారు. ఈ సందర్భంగా మగ్గంతో నేసిన ఆయన చిత్రపటాన్ని వారు చంద్రబాబుకు బహూకరించారు. దానిని పరిశీలించిన ఆయన.. ఎంతో నైపుణ్యంతో తన చిత్రపటాన్ని వస్త్రంపై నేసిన చేనేత దంపతులను అభినందించారు.

