
ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. డీఎస్సీ-2025 నియామకాలపై వస్తున్న విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ తమీమ్ అన్సారియా స్పందించారు. వచ్చే అక్టోబర్లో మరో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి, డిసెంబర్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
అమరావతిలో మీడియాతో మాట్లాడిన కమిషనర్ తమీమ్ అన్సారియా.. మెగా డీఎస్సీ-2025 ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించినప్పటికీ.. గత కొన్ని నెలలుగా డీఎస్సీకి సంబంధించి ఆధారాలు లేని ఆరోపణలు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం కొనసాగుతోందని పేర్కొన్నారు.
హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్లపై ఇప్పటికే ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చారని కమిషనర్ తెలిపారు. అయినప్పటికీ కొందరు సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్సీ-2025లో ఎంపికైన ఉపాధ్యాయులను కించపరిచేలా పోస్టులు పెట్టడం సరికాదని అన్నారు. ఎంపికైన అభ్యర్థుల ప్రతిభను పాఠశాల విద్యాశాఖ గౌరవిస్తోందని, వారికి శాఖ పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.
ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులు సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాన్ని పట్టించుకోకుండా.. తమ లక్ష్యంపై దృష్టి సారించి పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని తమీమ్ అన్సారియా సూచించారు. అక్టోబర్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, డిసెంబర్లో పరీక్షలు నిర్వహిస్తామని మరోసారి స్పష్టం చేశారు.
ఇక స్పోర్ట్స్ కోటా కింద ఉపాధ్యాయ నియామకాల అంశంపై ఏపీ స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్, ఎండీ భరణి కూడా వివరాలు వెల్లడించారు. అన్ని స్పోర్ట్స్ అసోసియేషన్లు, ఫెడరేషన్ల నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించినట్లు తెలిపారు. ప్రతి అభ్యర్థి సమర్పించిన సర్టిఫికెట్లను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ప్రిలిమినరీ ప్రాధాన్యత జాబితాను రూపొందించి పాఠశాల విద్యాశాఖకు పంపినట్లు వెల్లడించారు.

