
భౌగోళిక గుర్తింపు పొందిన బొబ్బిలి వీణకు ఇటీవల కాలంలో కలప కష్టాలు వచ్చాయి. ఒక జిల్లా – ఒక ఉత్పత్తి పథకంలో భాగంగా బొబ్బిలి వీణను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయగా.. ఏడాది కిందట కేంద్ర బృందం కూడా వీణల తయారీ కేంద్రాలను పరిశీలించింది. ఆ సమయంలో కలప కొరతతో ఆర్డర్లు తీసుకోలేక పోతున్నారని గుర్తించారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బొబ్బిలి వీణకు పనస కలప అందించేందుకు అటవీశాఖకు అనుమతిచ్చారు. ఈ నెల 15న పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
బొబ్బిలి పేరు వినిపించగానే మనకు గుర్తుకొచ్చేది విజయనగరం రాజులు. విజయనగరం రాజులతో పాటు బొబ్బిలి వీణలకు కూడా మంచి పేరే ఉంది. బొబ్బిలిలో వీణలు తయారు చేసే వారు చాలా మందే ఉన్నారు. అయితే, ఇటీవల కాలంలో బొబ్బిలి వీణల తయారీకి అవసరమైన కలప దొరక్క కష్టాలు మొదలయ్యాయి. వీణల తయారీకి పనస కలప కావాలి.. కానీ, అది అందుబాటులో లేకపోవడంతో వీణల తయారీ నిలిచిపోయింది. అయితే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో మళ్లీ బొబ్బిలి వీణకు మంచి రోజులు వచ్చాయి.
బొబ్బిలి వీణకు కలప అందించాలంటూ కళాకారులు ఎమ్మెల్యే బేబినాయనకు విన్నవించగా.. వారు అసెంబ్లీలో ప్రస్తావించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించి, కావాల్సిన ముడి సరకును రాయితీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వీణల తయారీకి అవసరమైన పనస కలపను అటవీ శాఖ ద్వారా సేకరించి రాయితీపై అందిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు విజయనగరం అటవీ రేంజ్ అధికారులు పనస కలపను సేకరించి సిద్ధం చేశారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ కలపను అందించే కార్యక్రమాన్ని ఈ నెల 15న ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక జిల్లా – ఒక ఉత్పత్తి పథకంలో భాగంగా బొబ్బిలి వీణను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎంపిక చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కళలను గుర్తించి, ఆయా కళాకారుల సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది.

