
ఏపీ ప్రభుత్వం రేషన్కార్డులు ఉన్నవారికి తీపికబురు చెప్పింది. ఇటీవల బహిరంగ మార్కెట్లో కంటే తక్కువ ధరకే బియ్యాన్ని విక్రయించే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసింందే. తాజాగా మంత్రి నాదేండ్ల మనోహర్ మరో కీలక ప్రకటన చేశారు. ఏపీలో రేషన్ షాపుల ద్వారా త్వరలోనే కందిపప్పు, పామాయిల్ను రాయితీపై తక్కువ ధరకే అందిస్తామన్నారు. బహిరంగ మార్కెట్లో ధరలు భారీగా పెరగడంతో.. ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతోఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో రేషన్కార్డులు ఉన్నవారికి తీపికబురు చెప్పింది. చాలాకాలంగా సరుకుల కోసం ఎదురు చూస్తున్నవారికి రిలీఫ్ దక్కింది. రేషన్ షాపుల్లో త్వరలోనే రాయితీ కందిపప్పు, పామాయిల్ కార్డుదారులకు అందజేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో భాగంగా కాకినాడలో తక్కువ ధరలకే నాణ్యమైన బియ్యం విక్రయాలను మంత్రి నాదెండ్ల ప్రారంభించారు. కాకినాడలోని మెయిన్రోడ్డు రామారావుపేటలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రితో పాటుగా ఎమ్మెల్యేలు శ్రీ వనమాడి కొండబాబు, పంతం నానాజీ, ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ పాల్గొన్నారు.
ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన కందిపప్పు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందన్నరు మంత్రి మనోహర్. ప్రతి రేషన్ కార్డుదారుకు 500 గ్రాముల కందిపప్పు అందించేందుకు ప్రతిపాదనలు చేశామని.. కేంద్ర ప్రభుత్వం నుంచి 1 లక్ష మెట్రిక్ టన్నుల కందులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి చేసిందన్నారు. ఆమోదం లభించిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా 30 వేల ఫెయిర్ ప్రైస్ షాపుల ద్వారా పంపిణీ చేస్తామన్నారు. కేంద్రం సహకారంతో రేషన్ షాపుల్ని మీ మార్ట్లుగా మారుస్తున్నామన్నారు మంత్రి. ఈ మీ మార్టుల్లో 64 రకాల నాణ్యమైన సరకులు విక్రయిస్తారన్నారు.
దేశంలోనే తొలిసారిగా పది శాతం నూకలతో నాణ్యతతో కూడిన స్టీమ్ రైస్ పంపిణీ చేస్తామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. రానున్న రెండు నెలల్లో చేపడతామని.. అది కూడా కాకినాడ జిల్లాలో రేషన్ కార్డుదారులకు అందజేస్తామన్నారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా మార్కెట్లో బియ్యం ధరలు పెరిగాయని.. ఈ ధరల్ని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్లు ద్వారా బియ్యం పంపిణీ చేస్తోందన్నారు. బీపీటీ స్టీమ్రైస్ కిలో రూ.52, బీపీటీ రా రైస్ కిలో రూ.50 చొప్పున అందిస్తున్నామన్నారు. ఐదు రోజుల్లో 14 వేల క్వింటాళ్ల బియ్యాన్ని విక్రయించినట్లు మంత్రి ప్రకటించారు. కూటమి ప్రభుత్వం నిత్యావసర సరకుల ధరల స్థిరీకరణే లక్ష్యంగా పనిచేస్తోంది అన్నారు. మొత్తం మీద త్వరలోనే రేషన్ షాపుల ద్వారా ప్రజలకు కందిపప్పు, పామాయిల్ అందజేయనున్నారు.

