
రాబోయే కాలమంతా ఎలక్ట్రికల్ వెహికల్స్దే. అందుకే గుంటూరులో నగరపాలక సంస్థ ఓ కీలక అడుగు వేసింది. జీఎంసీ పరిధిలో పది ముఖ్యమైన ప్రాంతాల్లో పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. రూ. 3 కోట్ల వ్యయంతో వీటిని నిర్మించనుంది. జీఎంసీ గుర్తించిన స్థలాల్లో టెండర్ల ద్వారా ఈ ఎలక్ట్రికల్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనుంది. పదేళ్ల కాల పరిమితితో ఈ ఛార్జింగ్ పాయింట్లను జీఎంసీ ఏర్పాటు చేయనుంది.
ఇక రానున్న కాలమంతా ఎలక్ట్రికల్ వెహికల్స్దే. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వాల ఆంక్షల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ వెహికల్స్ను తగ్గిస్తూ ఎలక్ట్రికల్ వెహికల్స్పై తయారీ కంపెనీలు కూడా దృష్టి పెట్టాయి. అయితే, ఎలక్ట్రికల్ వెహికల్స్ సేల్స్ అవుతున్నప్పటికీ ఛార్జింగే దానికి ప్రధాన సమస్యగా మారింది. పెట్రోల్ బంక్ మాదిరిగా ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఛార్జింగ్ పాయింట్లు లేకపోవడమే దానికి కారణం. కొన్ని ప్రైవేట్ ఛార్జింగ్ పాయింట్లు ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రభుత్వమే నేరుగా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది.
గుంటూరు నగరపాలక సంస్థ ఛార్జింగ్ స్టేషన్లపై కీలక అడుగు వేసింది. ఎలక్ట్రికల్ వెహికల్స్ వినియోగాన్ని పెంచేందుకు పది ముఖ్యమైన ప్రాంతాల్లో పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబోతోంది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ చర్యలు తీసుకుంటోంది. కలెక్టర్, జీఎంసీ స్పెషలాఫీసర్ సాయికాంత్ వర్మ జూలై 17న కౌన్సెల్ తీర్మానం ద్వారా ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆమోదం కోరుతూ జీఎంసీ కమిషనర్ అశోక్ జూలై 20న సీడీఎంఏకు నివేదిక పంపించారు.
ఈ ప్రాజెక్టును రూ. 3 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేట్ పద్ధతిలో పీపీపీ ద్వారా ఈ ప్రాజెక్టు అమలవుతుంది. జీఎంసీ గుర్తించిన స్థలాల్లో టెండర్ల ద్వారా ఎంపికైన ప్రైవేట్ ఛార్జ్ పాయింట్ ఆపరేటర్లు మౌలిక వసతులు, ఛార్జింగ్ పరికరాలు సొంతంగా ఏర్పాటు చేస్తారు. ప్రతి కిలో వాట్ అవర్కు రూ. 1 చొప్పున జీఎంసీకి రాబడి వచ్చేలా డిజైన్ చేశారు.
ఛార్జింగ్ కేంద్రాల్లో కనీసం ఒక 30 కేడబ్ల్యూ సింగిల్ సీపీఎస్ – 2డీసీ ఫాస్ట్ ఛార్జర్ తప్పనిసరి. అవసరాన్ని బట్టి అదనంగా అందుబాటులోకి తీసుకొస్తారు. అన్ని ఛార్జర్లకు ఏఆర్ఏఐ/ఐసీఏటీ అనుమతి ఉండాలి. స్థలం అప్పగించిన నాటి నుంచి నాలుగు నెలల్లో ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభించాలి. ఛార్జింగ్ స్లాట్లు బుక్ చేసుకోవడం, ఆన్లైన్ చెల్లింపులు, లొకేషన్లను ట్రాక్ చేయడానికి సీపీఓ ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ రూపొందిస్తుంది. ఛార్జింగ్ కేంద్రాల వద్ద కియోస్కులు, రిఫ్రష్మెంట సెంటర్లు జీఎంసీ అనుమతితో ఏర్పాటు చేయొచ్చు.

