బెంగళూరులోని ఓ ఫైవ్స్టార్ హోటల్లో ఇద్దరు చిన్నారులు అనుమానాస్పదంగా మృతిచెందారు. 10, 5 ఏళ్ల కుమార్తెల మృతదేహాలు మంచంపై కనిపించగా.. వారి తండ్రి ఇమ్రాన్ టాయిలెట్లో గొంతు కోసుకున్న స్థితిలో కనిపించాడు. భార్యపై అనుమానంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

బెంగళూరులోని ఓ ఫైవ్స్టార్ హోటల్లో తీవ్ర విషాద ఘటన వెలుగుచూసింది. 10, 5 ఏళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు హోటల్ గదిలో మృతిచెందగా.. వారి తండ్రి తీవ్ర గాయాలతో టాయిలెట్లో కనిపించాడు. ఘటనపై పోలీసులు హత్య, ఆత్మహత్య కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. నాగవార ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల ఇమ్రాన్ సోమవారం సాయంత్రం తన ఇద్దరు కుమార్తెలతో కలిసి హోటల్లో చెక్ఇన్ అయ్యాడు. మంగళవారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో హోటల్ క్లీనింగ్ సిబ్బంది గదిని శుభ్రం చేసేందుకు వెళ్లారు. తలుపు తట్టి పలుమార్లు పిలిచినా లోపలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో అనుమానం వచ్చి తలుపు తెరిచి చూడగా.. గదిలో ఇద్దరు చిన్నారులు మృతిచెందిన స్థితిలో కనిపించారు. అదే సమయంలో టాయిలెట్లో వారి తండ్రి తీవ్ర గాయాలతో కనిపించడంతో సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. చిన్నారుల మృతికి గల కారణాలు, తండ్రికి గాయాలు ఎలా అయ్యాయన్న అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలు లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
హోటల్ గదిలోని మంచంపై 10, 5 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలికలు విగతజీవులుగా కనిపించారు. అదే సమయంలో టాయిలెట్లో ఇమ్రాన్ తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. అతడు గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే హోటల్ సిబ్బంది అతడిని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇమ్రాన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
భార్యపై అనుమానంతోనే దారుణానికి పాల్పడ్డాడా?
ప్రాథమిక దర్యాప్తులో ఇమ్రాన్కు తన భార్యపై అనుమానాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమెకు వివాహేతర సంబంధం ఉందని అతడు అనుమానించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ అనుమానాల నేపథ్యంలోనే తన ఇద్దరు కుమార్తెలను హతమార్చి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇమ్రాన్ తన ఇద్దరు కుమార్తెలను గొంతు నులిమి హత్య చేసిన అనంతరం, టాయిలెట్లోకి వెళ్లి తన గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇమ్రాన్.. తన కుమార్తెలను తానే హతమార్చినట్లు అంగీకరించినట్లు డీసీపీ జీకే మిథున్ కుమార్ తెలిపారు. ఘటనకు దారితీసిన పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇమ్రాన్ వృత్తి, కుటుంబ పరిస్థితులు, భార్యపై అతడికి ఎందుకు అనుమానం కలిగింది, ఆ అనుమానాల వెనుక వాస్తవాలు ఏమిటి వంటి అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే ఈ దారుణ ఘటనకు అసలు కారణం ఏంటనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులను విచారించడంతో పాటు ఇతర ఆధారాలను సేకరిస్తున్న పోలీసులు.. దర్యాప్తు పూర్తయ్యే కొద్దీ మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

