
నెల్లూరు నగరపాలక సంస్థ సాధారణ సర్వసభ్య సమావేశం గురువారం కార్పొరేషన్ కార్యాలయంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించారు. మేయర్ దేవరకొండ సుజాత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 150 అజెండా తీర్మానాలను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది.
ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, ఆరోగ్య భద్రత, నగరాభివృద్ధికి సంబంధించిన అంశాలకు అజెండాలో ప్రాధాన్యత ఇచ్చినట్లు మేయర్ తెలిపారు. అన్ని డివిజన్లకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను తీర్మానాల్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.
మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పి. నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సారథ్యంలో, కార్పొరేటర్ల సహకారంతో నెల్లూరు నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని మేయర్ సుజాత అన్నారు.
కార్పొరేషన్ కమిషనర్ వై.ఓ. నందన్, అధికారులు, సిబ్బంది, ప్రజల సహకారంతో నగర అభివృద్ధికి సమన్వయంతో కృషి చేస్తామని ఆమె తెలిపారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ సయ్యద్ తహసీన్, కో-ఆప్షన్ సభ్యులు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

