
డా. బీఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ ప్రాంగణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం తనకు మంత్రిగా దక్కిన అత్యున్నత గౌరవంగా భావిస్తున్నట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుని ఘన నివాళులు అర్పించారు. వారి త్యాగాల స్ఫూర్తితో దేశ ప్రగతి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ శకటాలు ఆకట్టుకున్నాయి
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న వైద్య ఆరోగ్య సేవలు, అన్న క్యాంటీన్ల ప్రాధాన్యత, వివిధ సంక్షేమ పథకాలను ప్రతిబింబించేలా రూపొందించిన శకటాలు ప్రజలను ఆకట్టుకున్నాయి.
సుపరిపాలనే లక్ష్యంగా ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పనిచేస్తోందని మంత్రి తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి వాసంశెట్టి సుభాష్ హృదయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైదియ దేవి, జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
భారత్ మాతాకీ జై!

