
విజయనగరం జిల్లా గుర్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గుర్ల ఎస్సై పిసిని నారాయణరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, కమిట్మెంట్ గ్రూప్ సభ్యులు పాల్గొని మొక్కలు నాటారు.
“స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు అవుతున్నా.. మనకు ప్రాణవాయువును అందించే చెట్లను మనం కాపాడుకోగలిగామా?” అనే సందేశంతో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేలా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పలవలస గోపాలరావు సూచనలతో, గుర్ల ఏపీఓ రత్నమాల సహకారంతో కలవచర్ల కమిట్మెంట్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
పోలీస్ స్టేషన్ ఆవరణలో వేప, మర్రి, రావి, కాము, నీలగిరి తదితర మొక్కలతో పాటు పలు రకాల పూలు, పండ్ల మొక్కలను నాటారు. నాటిన మొక్కలు కేవలం పచ్చదనాన్ని పెంచడమే కాకుండా భవిష్యత్ తరాలకు అందించే విలువైన కానుకలని నిర్వాహకులు పేర్కొన్నారు.
ప్రజల రక్షణ కోసం పోలీసులు 24 గంటలూ విధులు నిర్వహిస్తున్నట్లే, ప్రకృతిని కాపాడటం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. NVN బ్లడ్ బ్యాంక్కు చెందిన నాగేశ్వరరావు, బెవర కూర్మారావు మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వ కార్యాలయ ఆవరణ పచ్చదనంతో కళకళలాడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో గుర్ల పోలీస్ స్టేషన్ సిబ్బంది, కమిట్మెంట్ గ్రూప్ సభ్యులు, కెల్ల ఫీల్డ్ అసిస్టెంట్ రాంబాబు, TA తమ్మినాయుడు, లైబ్రరీ రామారావు తదితరులు పాల్గొన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను అందరూ కలిసి స్వీకరించారు.
“ఒక మొక్క నాటండి.. ఒక జీవితాన్ని కాపాడండి” అనే సందేశంతో కార్యక్రమాన్ని ముగించారు. ప్రకృతిని పరిరక్షించడమే నిజమైన దేశభక్తి అని నిర్వాహకులు పేర్కొన్నారు.

