
విశాఖపట్నంలోని షీలానగర్ జంక్షన్ వద్ద మట్టికుప్పలో మూడు మృతదేహాలు బయటపడటం కలకలం రేపింది. షీలానగర్–సబ్బవరం పోర్టు కనెక్టివిటీ రోడ్డు నిర్మాణ పనుల కోసం మట్టిని లారీలోకి ఎత్తుతుండగా మృతదేహాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో మృతులు ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు.
మృతదేహాలు షీలానగర్ ప్రాంతానికి చెందినవారివా? ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అక్కడ పడేశారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మట్టి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, మృతదేహాలు మట్టికుప్పలోకి ఎలా వచ్చాయనే అంశాలపైనా విచారణ కొనసాగుతోంది.
మృతుల గుర్తింపు, మరణానికి గల కారణాలు పోస్టుమార్టం నివేదికతో పాటు దర్యాప్తులో తేలాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి వివరాల కోసం విచారణ చేపట్టారు.

