
తమిళనాడు రాజకీయాల్లో పరందూర్ ప్రతిపాదిత విమానాశ్రయం అంశం మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. చెన్నై సమీపంలోని సారవంతమైన బహుళ పంటల వ్యవసాయ భూములు, జలాశయాలను కాపాడాలంటూ స్థానికులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా నిలిచిన ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్, పరందూర్ విమానాశ్రయ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు.
అయితే ఈ నిర్ణయాన్ని మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతామని డీఎంకే హెచ్చరించడంతో ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో మరింత వేడెక్కింది.
తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో ప్రతిపాదించిన పరందూర్ విమానాశ్రయ ప్రాజెక్ట్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర వివాదానికి కేంద్రంగా మారింది. చెన్నైకి సుమారు 70 కిలోమీటర్ల దూరంలోని పరందూర్ ప్రాంతంలో భారీ విమానాశ్రయం నిర్మించేందుకు గతంలో ప్రతిపాదనలు వచ్చాయి. అయితే ఈ ప్రాజెక్ట్ వల్ల పంటలు పండించే వ్యవసాయ భూములు, చెరువులు, పర్యావరణ వ్యవస్థలు దెబ్బతింటాయని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్ట్ను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన నిరసనలకు మొదటి నుంచీ మద్దతుగా నిలిచిన ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్.. తాజాగా కీలక నిర్ణయం ప్రకటించారు. పరందూర్ విమానాశ్రయ ప్రాజెక్ట్ను పూర్తిగా విరమించుకుంటున్నట్లు ఆయన వెల్లడించడంతో రాజకీయంగా తీవ్ర చర్చ మొదలైంది.
ఈ నిర్ణయంపై అధికారంలో ఉన్న టీవీకే, ప్రతిపక్ష డీఎంకే మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. విమానాశ్రయ ప్రాజెక్ట్ చుట్టూ చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, రైతుల ఆందోళనలు, పర్యావరణ ఆందోళనలు, అలాగే ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వెనుక ఉన్న కారణాలపై పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎన్నికలకు ముందు నుంచే పరందూర్ విమానాశ్రయ ప్రాజెక్ట్ను తీవ్రంగా వ్యతిరేకించిన విజయ్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంపై పెద్దగా స్పందించలేదు. అయితే తాజాగా దీనిపై కీలక ప్రకటన చేశారు. పరందూర్ విమానాశ్రయ ప్రాజెక్ట్ను పూర్తిగా వదులుకుంటున్నట్లు ప్రకటిస్తూ, ఈ ప్రాజెక్ట్కు వ్యతిరేకంగా పోరాడుతున్న నిరసనకారులకు ఎప్పటికీ తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
పారిశ్రామిక అభివృద్ధికి విమానాశ్రయాలు అవసరమే అయినప్పటికీ, రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి వాటిని నిర్మించకూడదని 2024 అక్టోబర్లో విక్రవాండిలో జరిగిన సమావేశంలోనే తాను స్పష్టంగా చెప్పిన విషయాన్ని విజయ్ గుర్తుచేశారు.
ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే క్రమంలోనే పరందూర్లో కొత్త విమానాశ్రయం ఏర్పాటు కోసం చేపట్టిన అన్ని చర్యలను ఉపసంహరించుకున్నామని ఆయన తెలిపారు. రైతుల సంక్షేమం, ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయ్ వెల్లడించారు.
భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన అనంతరం విజయ్ ప్రభుత్వం పరందూర్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసం ప్రతిపాదించిన స్థలాన్ని పునఃసమీక్షిస్తామని ప్రకటించింది. స్థానిక జలాశయాలు, సారవంతమైన వ్యవసాయ భూములకు నష్టం కలగకుండా ప్రత్యామ్నాయ ప్రాంతాలను అన్వేషించేందుకు సమగ్ర పరిశీలన చేపడుతున్నట్లు టీవీకే నేత సీటీఆర్ నిర్మల్ కుమార్ అప్పట్లో వెల్లడించారు.
తాజాగా ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయంతో ఆ హామీని అమలు చేసినట్లయింది. పరందూర్ విమానాశ్రయానికి వ్యతిరేకంగా చాలాకాలంగా నిరసనలు కొనసాగిస్తున్న రైతులు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ వ్యవసాయ భూములు, జలవనరులను కాపాడే దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రైతులు స్వాగతిస్తున్నారు.
Log inSign up for free

