
పాత్ర నిడివి కంటే.. తెరపై ఆ పాత్ర ఎంత బలంగా కనిపిస్తుందన్నదే బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా ప్రధానంగా చూస్తారు. అందుకే ఆయన ఎంచుకునే పాత్రలపై ప్రేక్షకుల్లోనూ ఆసక్తి ఉంటుంది. ‘ఛావా’లో ఔరంగజేబుగా, ‘ధురంధర్’లో రెహమాన్ బలోచ్గా మెప్పించిన అక్షయ్.. ఇప్పుడు పురాణ నేపథ్యంలోని ‘మహాకాళి’ చిత్రంలో శుక్రాచార్యుడిగా కనిపించనున్నారు.
రెండు సినిమాల్లో రెండు విభిన్న పాత్రలు
‘ఛావా’లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా తన నటనతో ఆకట్టుకున్నారు. ఎక్కువ డైలాగులు లేకుండానే హావభావాలు, చూపులతో పాత్రకు బలం తీసుకొచ్చారు.
ఆ తర్వాత ‘ధురంధర్’లో రెహ్మాన్ బలోచ్ పాత్రలో పూర్తిగా భిన్నమైన షేడ్స్ చూపించారు. ఆయన ఎంట్రీ సన్నివేశాలు, మేనరిజమ్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ఈ రెండు చిత్రాల్లోనూ అక్షయ్ పాత్రలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి.
‘మహాకాళి’లో శుక్రాచార్యుడిగా..
ఇప్పుడు అక్షయ్ ఖన్నా నటిస్తున్న ‘మహాకాళి’పై ఆసక్తి పెరగడానికి ఆయన పోషిస్తున్న శుక్రాచార్యుడి పాత్రే ప్రధాన కారణం. పురాణాల ప్రకారం శుక్రాచార్యుడు అసురులకు గురువు. దేవతలు, దానవుల మధ్య జరిగే పోరాటాల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తారు. మృతులను సైతం తిరిగి బతికించే శక్తి ఆయనకు ఉందనే విశ్వాసం ఉంది.
తాజాగా ‘శుక్రాచార్య వార్ క్రై’ పేరుతో విడుదలైన వీడియోలో అక్షయ్ లుక్ ఆకట్టుకుంటోంది. తెల్లటి గడ్డం, తీక్షణమైన చూపులు, గంభీరమైన వేషధారణతో ఆయన కనిపించిన తీరు సినిమాపై అంచనాలు పెంచుతోంది.
“అమృత మథన సమయమున.. ఇది ధర్మమా.. అధర్మమా?” అంటూ అక్షయ్ చెప్పే డైలాగ్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ పాత్రలో అక్షయ్ ఖన్నా ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.

