ఏపీ అసెంబ్లీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. తన రాజకీయ జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నానని.. మిగిలిన మూడేళ్లలో నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు.

అయ్యన్నపాత్రుడు పుట్టినరోజు సందర్భంగా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి, పెదబొడ్డేపల్లి మార్కెట్ యార్డులో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. సుమారు 852 మంది రక్తదానం చేశారు. ఎంపీ చింతకాయల విజయ్‌తో పాటు పలువురు నేతలు కూడా రక్తదానం చేశారు. హైదరాబాద్‌కు చెందిన గో ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించి బీపీ, షుగర్ పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు.

అయ్యన్నపాత్రుడికి నేతలు, అధికారులు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇదే రోజు ఆయన మనవడు, రాజ్యసభ ఎంపీ చింతకాయల విజయ్ కుమారుడు శివన్ పాత్రుడు పుట్టినరోజు కావడంతో కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

నర్సీపట్నంలో బీసీ ఐక్య వేదిక సదస్సు

ఈ నెల 6న నర్సీపట్నంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో బీసీ ఐక్య వేదిక సదస్సు నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో అవకాశాలు కల్పించేందుకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తోందని టీడీపీ నేతలు తెలిపారు.

ప్రస్తుత జనాభా ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే.. వైఎస్సార్‌సీపీ దీనిపై రాజకీయాలు చేస్తోందని టీడీపీ నేతలు విమర్శించారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో బీసీ ఐక్య వేదిక సదస్సుకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *