గుంటూరు: మూడు నెలలుగా అదృశ్యమైన పదో తరగతి బాలిక ఆచూకీ లభించకపోవడంపై ఏపీ హైకోర్టు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలికను వెంటనే గుర్తించి కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించినప్పటికీ.. డీజీపీ సిట్‌ ఏర్పాటు చేయడంపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది.

గుంటూరు పట్టాభిరామపురం పోలీస్‌ స్టేషన్‌లో జూన్‌ 10న బాలిక అదృశ్యంపై కేసు నమోదైంది. ట్యూషన్‌కు వెళ్లిన తన కుమార్తె తిరిగి ఇంటికి రాలేదని తండ్రి ఫిర్యాదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయమైన ఓ యువకుడు బాలికను తీసుకెళ్లాడని ఆయన ఆరోపించారు. కేసు నమోదై దాదాపు మూడు నెలలు గడుస్తున్నా బాలిక ఆచూకీ లభించకపోవడంతో తండ్రి హైకోర్టును ఆశ్రయించారు.

హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. బాలికను 24 గంటల్లో గుర్తించి తమ ముందు హాజరుపరచాలని ఆదేశించింది. అయితే, ఈ ఆదేశాల నేపథ్యంలో డీజీపీ సిట్‌ ఏర్పాటు చేయడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది తిరుమాను విష్ణుతేజ మాట్లాడుతూ.. బాలిక ఆచూకీ ఇంకా లభించలేదని, కేసును కిడ్నాప్‌ కేసుగా మార్చడంతో పాటు డీజీపీ సిట్‌ ఏర్పాటు చేశారని కోర్టుకు తెలిపారు. సిట్‌ సభ్యుల వివరాలను కూడా ధర్మాసనం ముందు ఉంచారు.

ఈ వివరాలను పరిశీలించిన జస్టిస్‌ బట్టు దేవానంద్‌, జస్టిస్‌ తుహిన్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం.. డీజీపీ తీరుపై ప్రశ్నలు సంధించింది. 24 గంటల్లో బాలికను గుర్తించి హాజరుపరచాలని ఆదేశించిన నేపథ్యంలో సిట్‌ ఏర్పాటు చేయడం ద్వారా బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దని వ్యాఖ్యానించింది.

బాలిక ఆచూకీపై గుంటూరు ఎస్పీ నుంచి డీజీపీ నివేదిక కోరడంపైనా ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. కేసును ఎలా దర్యాప్తు చేయాలో కోర్టు డీజీపీకి చెప్పే పరిస్థితి తీసుకురావద్దని ఘాటుగా వ్యాఖ్యానించింది.

దేశ, రాష్ట్ర అభివృద్ధి కోసం ఉన్నత స్థాయి నాయకులు తమ వయసుతో సంబంధం లేకుండా నిరంతరం పనిచేస్తున్నారని ప్రస్తావించిన ధర్మాసనం.. ఒక బాలిక ఆచూకీని కూడా పోలీసులు గుర్తించలేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. బాలికను సురక్షితంగా గుర్తించి కోర్టు ముందు హాజరుపరచడంపై పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

హైకోర్టు వ్యాఖ్యలతో ఈ కేసు మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *