
ఏపీ ప్రభుత్వ శాఖలలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగుల క్రమబద్ధీకరణపై హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. వీరిని నామమాత్రపు జీతాలతో నియమించుకుని పనిచేయించుకోవడం శ్రమ దోపిడికి పాల్పడటమేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. వివిధ శాఖలలో పోస్టుల్ని శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయకపోవడాన్ని ఆక్షేపించింది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వారిని రెండు నెలల్లోగా క్రమబద్ధీకరించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కీలక వ్యాఖ్యలు చేసింది. దశాబ్దాలుగా తక్కువ జీతంతో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో పనిచేయించుకోవడం శ్రమ దోపిడీగా వ్యాఖ్యానించింది. ఉద్యోగుల్ని శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని.. కానీ ప్రభఉత్వం కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమించడాన్ని తాము గమనించామని జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ సుబేంధుసామంతతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని శాశ్వత రెగ్యులర్ ఉద్యోగులతో పనిచేయించుకుంటున్నారని.. కానీ రోజువారీ వేతన జీవులుగా ఉంచడం సరికాదన్నారు. రెండు నెలల్లో పిటిషన్ దాఖలు చేసిన ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించాలని ఆదేశించింది. ఏపీ అడ్మినిస్ట్రేషన్ ట్రైబ్యునల్ పిటిషనర్ల సర్వీసును క్రమబద్ధీకరించడాన్ని నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్ని రద్దు చేశారు.
ఇలాంటి కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఎప్పుడూ ఆదర్శ యజమానిగా ఉండాలని వ్యాఖ్యానించింది హైకోర్టు ధర్మాసనం. వివిధ శాఖల్లో ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన కాకుండా అర్హులున్నా సరే అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన తక్కువ వేతనాలకు నియమించడం సరికాదని అభిప్రాయపడింది. గతంలో ఎన్నో సందర్భాల్లో తమను క్రమబద్ధీకరించాలని కోరితే సాకులు చెప్పడం సరికాదన్నారు. సాంకేతిక కారణాలు, నియామకాలు సక్రమంగా జరగలేదని చెప్పడం సర్వసాధారణంగా మారిందన్నారు.. ఇలా సాకులు చెప్పి కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ హక్కులను నిరాకరించడానికి వీల్లేదని ధర్మాసనం తెలిపింది.

