
ఏపీలో భగీరథ ప్రయత్నం జరుగుతోందని ఏపీ స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి రామ్ అన్నారు. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంతో రాష్ట్రం సస్యశ్యామలం అవుతోందని పేర్కొన్నారు.
బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. వెలిగొండ ప్రాజెక్ట్ తొలిదశను సీఎం చంద్రబాబు ప్రారంభించారని, పోలవరం కాలువను త్వరలో ప్రారంభించనున్నారని తెలిపారు. దీంతో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందన్నారు. రాయలసీమకు నీటి విషయంలో న్యాయం జరుగుతోందని చెప్పారు.
36 ప్రాజెక్టులతో ప్రాజెక్టుల క్యాలెండర్ను విడుదల చేశామని, అందులో 14 ప్రాజెక్టులు రాయలసీమలో ఉన్నాయని పట్టాభి రామ్ తెలిపారు. చంద్రబాబు అపర భగీరథుడిలా ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నారని అన్నారు.
వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. ఐదేళ్లలో రాయలసీమ ప్రాజెక్టులకు కనీసం రూ.2 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. పోలవరం పనులను 17 నెలలు నిలిపివేశారని, డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి జగన్ ప్రభుత్వమే కారణమని విమర్శించారు.
రివర్స్ టెండరింగ్ పేరుతో వైసీపీ నేతలు దోచుకున్నారని ఆరోపించిన పట్టాభి రామ్.. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి జగన్ అసహనంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. ‘క్రెడిట్ చోరీ డిజార్డర్’తో వైసీపీ నేతలు బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. జలయజ్ఞం అంటే ధనయజ్ఞం కాదని స్పష్టం చేశారు.
