
ఆంధ్రప్రదేశ్లో మరో భారీ ప్రాజెక్టుకు అడుగులు పడుతున్నాయి. ప్రముఖ రక్షణ రంగ ప్రభుత్వరంగ సంస్థ మజ్గావ్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్ (MDL) రాష్ట్రంలో షిప్బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దుగరాజపట్నంలో ప్రతిపాదిత షిప్యార్డు నిర్మాణంలోనూ భాగస్వామ్యం చేసేందుకు MDL సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవల MDL ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో సమావేశమై ఈ ప్రతిపాదనలపై చర్చించారు. మొత్తం ప్రాజెక్టుపై సుమారు రూ.26 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా.
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన MDL.. భారత నౌకాదళం, తీర రక్షక దళం కోసం నౌకలు, జలాంతర్గాముల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోంది. దుగరాజపట్నం షిప్యార్డు నిర్మాణానికి MDLతో ఒప్పందం కుదుర్చుకునే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ప్రాజెక్టులో భాగంగా మూలధన పెట్టుబడిపై 30 శాతం రాయితీ ఇవ్వాలని MDL ప్రతిపాదించినట్లు సమాచారం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దుగరాజపట్నం పోర్టుకు అవసరమైన కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యయాన్ని కేంద్రం భరించనుండగా, భూమిని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది.
పోర్టు, షిప్యార్డు, అనుబంధ పరిశ్రమల అభివృద్ధి కోసం సుమారు 2,200 ఎకరాల భూమిని సమీకరించేందుకు ఏపీ మారిటైం బోర్డు చర్యలు చేపట్టింది. ఇందులో షిప్యార్డుకు సుమారు 1,000 ఎకరాలు, అనుబంధ పరిశ్రమలకు 1,350 ఎకరాలు కేటాయించే ప్రతిపాదన ఉంది.
దుగరాజపట్నం పోర్టు, షిప్బిల్డింగ్, షిప్ రిపేర్ క్లస్టర్ అభివృద్ధికి సంబంధించిన డీపీఆర్ తయారీ కోసం టెక్నికల్ కన్సల్టెంట్ను ఎంపిక చేయనున్నారు. ఈ నెల 24న ఈవోఐ ప్రతిపాదనలను పరిశీలించి కన్సల్టెంట్ను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే రాష్ట్రంలో నౌకా నిర్మాణ రంగానికి భారీ ఊతం లభించడంతో పాటు పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.

