
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను ఎలాంటి ఆటంకాలు లేకుండా సమర్థవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. SIR విధుల్లో భాగస్వాములైన వివిధ శాఖల అధికారుల బదిలీలపై కొనసాగుతున్న నిషేధాన్ని అక్టోబర్ 3వ తేదీ వరకు పొడిగిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల నమోదు, జాబితా సవరణ కార్యక్రమం సజావుగా కొనసాగేందుకు సంబంధిత అధికారులు, సిబ్బంది ఒకే ప్రాంతంలో విధులు నిర్వహించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం పేర్కొంది.
ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణలో అర్హత కలిగిన కొత్త ఓటర్ల నమోదుతో పాటు.. బోగస్ ఓట్ల తొలగింపు, ఓటర్ల వివరాల్లో మార్పులు, చేర్పులపై అధికారులు దృష్టి పెట్టారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలను స్వీకరించనున్నారు.
అందిన దరఖాస్తులు, అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సెప్టెంబర్ 28 నాటికి పూర్తిగా పరిష్కరించనున్నారు. అనంతరం సవరణ ప్రక్రియను ముగించి.. అక్టోబర్ 3వ తేదీన SIR తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నారు.
ముఖ్యంగా బూత్ స్థాయి అధికారులు (BLOలు), అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు (AEROలు), ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు (EROs)తో పాటు ఈ ప్రక్రియలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న ఇతర కీలక ప్రభుత్వ అధికారులకు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి.
విధుల్లో ఉన్న అధికారులను మధ్యలో బదిలీ చేస్తే ఎన్యూమరేషన్, డిజిటలైజేషన్ వంటి కీలక పనుల వేగం తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో తుది ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తయ్యే వరకు బదిలీలపై నిషేధాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. అక్టోబర్ 3న తుది జాబితా విడుదలయ్యేంత వరకు SIR విధుల్లో ఉన్న సిబ్బంది బదిలీలపై ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

