
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆంధ్రప్రదేశ్కు నాలుగు రోజుల వర్ష హెచ్చరికను జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా ప్రజలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
ఆమె తెలిపిన వివరాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవవచ్చు. భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని, ఇవి ఎక్కువగా అక్కడక్కడా కురిసే వర్షాలు (ఐసోలేటెడ్ రైన్స్) అని ఆమె స్పష్టం చేశారు. ఈ వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది, కొన్ని సందర్భాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగం వరకు కూడా గాలులు పెరగొచ్చు.
ఈ వర్షాలు ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత లేదా సాయంత్రం 3 గంటల తర్వాత సంభవించే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ పరిస్థితి రాబోయే ఐదు రోజుల వరకు కొనసాగవచ్చని, ఆ తర్వాత ఏప్రిల్ మొదటి వారం నుంచి ఉష్ణోగ్రతలు తిరిగి పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వర్షాలను అకాల వర్షాలుగా భావించరాదని, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సంభవించే సమ్మర్ రైన్స్ అని ఇవి సాధారణ వాతావరణ మార్పులేనని స్టెల్లా వివరించారు.
ఉపరితల ఆవర్తనం, ద్రోణి వంటి వాతావరణ పరిస్థితుల వల్ల ఇలాంటి వర్షాలు కురవడం సహజం. ప్రజలు ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలి. బయటకు వెళ్లడం మానుకోవాలి. విద్యుత్ స్తంభాలు, నీటి వనరులు, చెట్ల కింద నిలబడటం, బయట ఉన్నప్పుడు మొబైల్ ఫోన్లు ఉపయోగించడం వంటివి పూర్తిగా నివారించాలని సూచించారు.

