
భద్రాచలం ఆలయంతో పాటు పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.586 కోట్లతో అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో మొదటి దశ పనుల కోసం రూ.351 కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటనలకు పరిమితం కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిధుల మంజూరుతో పాటు స్పష్టమైన గడువును నిర్ణయించింది. ఈ ఏడాదే పనులు ప్రారంభం కానుండగా.. గోదావరి ఘాట్లు, ఆలయ ప్రాకారాల విస్తరణ, భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
తెలంగాణ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం ఆలయానికి మహర్దశ పట్టనుంది. రూ.586 కోట్లతో 3 దశల్లో రామాలయం అభివృద్ధికి మాస్టర్ప్లాన్ సిద్ధమైంది. అభివృద్ధి పనులకు తొలివిడత నిధులు మంజూరు చేస్తూ రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. భద్రాచలం రామాలయం పునరాభివృద్ధికి తొలిదశలో రూ.351 కోట్లు ఖర్చు చేయనున్నారు. భద్రాచలం ఆలయంతో పాటు పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. మొదటిదశలో గోదావరి ఘాట్ అభివృద్ధి, ఆలయ పరిసరాల విస్తరణ, మౌలిక వసతుల మెరుగుదల పనుల్ని చేపట్టనున్నారు. ఈ పనుల కోసం గోదావరి ఘాట్కు రూ.75 కోట్లు, ఆలయ సముదాయానికి రూ.180 కోట్లు, ఆలయ పరిసరాల అభివృద్ధికి రూ.96 కోట్లు కేటాయించారు.
రెండో దశలో ఆలయం సమీపంలో అభివృద్ధి పనులు, మూడో దశలో భద్రాచలం పట్టణ సమగ్ర అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ పనులు 2026లోనే మొదలవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతేడాది భద్రాచలం పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆలయ సమగ్ర అభివృద్ధికి హామీ ఇచ్చారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా, ఆలయ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధి పనుల్ని ఆగమ శాస్త్రానికి అనుగుణంగా చేపడతామని చెప్పారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, క్షేత్రవైభవాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ ప్రాజెక్టుతో పర్యాటక రంగానికి కొత్త శోభ లభించడంతోపాటు స్థానిక ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

