
అమరావతి చట్టబద్ధతకు మరో కీలక అడుగు పడింది. ఇవాళ బుధవారం (ఏప్రిల్ 01, 2026 ) ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని కేంద్రం ఆమోదించింది. ఆ తర్వాత లోక్సభ ముందుకు ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు తీసుకువచ్చారు. అయితే లోక్సభలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. ఒక అధికార పక్షం ప్రవేశపెట్టిన బిల్లుకు ప్రతిపక్షం సంపూర్ణ మద్దతు పలకడం విశేషం.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ విభజన సందర్భంగా ఏపీకి అనేక హామీలు ఇచ్చిందని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ గుర్తు చేశారు. అమరావతి నిర్మాణానికి పూర్తి సహకారం ఎక్కడ ? అని ఆయన ప్రశ్నించారు. పన్ను రాయితీలు, పరిశ్రమలకు రాయితీలు ఇస్తామని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది, ప్రత్యేక హోదాపై పార్లమెంట్ సాక్షిగా నాటి ప్రధాని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వాటిని వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్దికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరించాలన్న మాణిక్యం ఠాగూర్, అమరావతితోపాటు తిరుపతి,విజయవాడ, వైజాగ్ నగరాలను కూడా అభివృద్ధి చేయాలన్నారు.
అమరావతి బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. రాష్ట్ర రాజధాని నిర్ణయమన్నది రాష్ట్రం ఇష్టమన్న ఎంపీ మిథున్ రెడ్డి, గతంలో హైకోర్టుకు కేంద్రం అఫిడవిట్ ఇచ్చిందన్నారు. అమరావతిపై కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు 5 వేల కోట్లే ఖర్చు చేసిందన్నారు. ఇప్పటివరకు అమరావతి రైతులకు ప్రభుత్వం ఫ్లాట్లు ఇవ్వలేదన్నారు. వైసీపీ అమరావతికి వ్యతిరేకం కాదన్న ఎంపీ మిథున్ రెడ్డి, ఈ బిల్లు ద్వారా రాష్ట్ర ప్రయోజనాలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. కానీ ఈ తరహాలో బిల్లు సరికాదని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. అమరావతి బిల్లును నిరసిస్తూ లోక్సభ నుంచి వైసీపీ వాకౌట్ చేస్తున్నట్లు మిథున్ రెడ్డి ప్రకటించారు.

