
ఆర్బీఐ కీలక రెపో రేట్లను మరోసారి యథాతథంగానే ఉంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 5.25 శాతంగానే ఉంది. దీంతో ప్రస్తుతానికి హోం లోన్ వడ్డీ రేట్లను బ్యాంకులు మార్చకపోవచ్చు. త్వరలో ద్రవ్యోల్బణం పెరిగితే మాత్రం వడ్డీ రేట్లను ఆర్బీఐ పెంచొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ప్రస్తుతం దేశంలోని టాప్ బ్యాంకుల్లో హోం లోన్లపై వడ్డీ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకుందాం.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) కీలక ప్రకటన చేసింది. యుద్ధం నేపథ్యంలో చమురు, గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. క్రూడాయిల్ ధరలు కూడా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారీ స్థాయిలో పెరగ్గా.. పలు వస్తువులు, ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈసారి ఆర్బీఐ రెపో రేట్లను పెంచుతుందని భావించినప్పటికీ.. అలా చేయలేదు. దీంతో ఇప్పటికైతే లోన్లు తీసుకునే వారికి వడ్డీ రేట్లు పెరగకపోవచ్చు. గతేడాది ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను భారీగా 125 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించగా.. హోం లోన్ సహా ఇతర లోన్ వడ్డీ రేట్లు భారీగా దిగొచ్చాయి. చారిత్రక కనిష్ఠ స్థాయిలకు చేరుకున్నాయి.
ప్రస్తుతం దేశంలోని టాప్ ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో హోం లోన్లపై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. యుద్ధం ఇలాగే కొనసాగితే.. ద్రవ్యోల్బణం పెరిగితే త్వరలో ఆర్బీఐ రెపో రేటు పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు. అప్పుడు లోన్ వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతానికి ఈ వడ్డీ రేట్లు మారకపోవచ్చు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ. 75 లక్షల వరకు హోం లోన్ తీసుకుంటే.. వడ్డీ రేట్లు 7.25 శాతం నుంచి 8.70 శాతంగా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో మరింత తక్కువగా 7.20 శాతం నుంచి ప్రారంభమవుతుండగా.. గరిష్ఠ వడ్డీ రేటు 9 శాతంగా ఉంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వడ్డీ రేట్లు 7.15 శాతం నుంచి 9.50 శాతంగా ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకులో వడ్డీ రేట్లు రూ. 30 లక్షల వరకు అయితే 7.25 శాతం నుంచి 9.10 శాతంగా ఉన్నాయి. రూ. 75 లక్షల వరకు లోన్పై చూస్తే 7.20 శాతం నుంచి 9 శాతంగా ఉన్నాయి.

